కేసీఆర్ ప‌థ‌కానికి… రేవంత్ సొమ్ములు!

అదేంటి? అనుకుంటున్నారా? కేసీఆర్ ప‌థ‌కానికి రేవంత్‌రెడ్డి సొమ్ములు ఇవ్వ‌డం ఏంట‌ని భావిస్తున్నారా? ఔను నిజ‌మే. కేసీ ఆర్ త‌న పాల‌నా కాలంలో చాలా గొప్ప‌గా అమ‌లు చేసిన ప‌థ‌కం బ‌తుక‌మ్మ చీర‌లు ప్ర‌తి ఏటా బ‌తుక‌మ్మ పండుగ‌కు ముందు ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా పేద మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ చీర‌ల నాణ్య‌త‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాలు ముసురుకున్న విష‌యం కూడా రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇదిలావుంటే.. ఈ బ‌తుక‌మ్మ చీర‌ల‌ను ప‌లు జిల్లాల్లోని చేనేత కార్మికుల నుంచి సేక‌రించారు. వీటికి సంబంధించి ప్ర‌భుత్వ‌మే ధ‌ర క‌ట్టింది.

ఇలా తీసుకున్న వాటికి అప్ప‌టి కేసీఆర్ ప్ర‌భుత్వం నిధులు చెల్లించాల్సి ఉంది. కానీ, ప్ర‌భుత్వం దిగిపోయే నాటికి కూడా చెల్లించ లేదు. ఇలా.. మొత్తం 351 కోట్ల రూపాయ‌ల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం బ‌కాయి పెట్టింది. ఆ నిధులు త‌మ‌కు చెల్లించాల‌ని.. అస‌లే అప్పుల్లో ఉన్నామ‌ని నేత కార్మికులు ప‌దే ప‌దే అప్ప‌టి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని వేడుకున్నారు. అయినా.. కార‌ణం ఏంటో కానీ.. కేసీఆర్ నిధులు చెల్లించ‌నేలేదు. ఇంత‌లోనే ఎన్నిక‌లు రావ‌డం.. ఆయ‌న ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వం ఇచ్చిన ఆర్డ‌ర్లు కాబ‌ట్టి.. త‌దుప‌రి వ‌చ్చిన ప్ర‌భుత్వ‌మైనా.. త‌మ‌కు బ‌కాయిలు చెల్లించాల‌ని నేత‌న్న‌లు వేడుకున్నారు.

వారి ఆవేద‌న‌ను ఆల‌కించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా నిధులు విడుద‌ల చేశారు. అయితే.. 351 కోట్ల‌లో తొలి విడ‌త‌గా రూ.50 కోట్లు మాత్ర‌మే ఇచ్చారు. వీటిని చిన్న‌స్థాయిలో ఉన్న నేత‌న్న‌ల‌కు ఇవ్వాల‌ని.. త‌దుప‌రి నిధులు ఆర్థిక వెసులు బాటు ను బ‌ట్టి అందిస్తామ‌ని తాజాగా ప్ర‌క‌టించారు. దీంతో ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్న చేనేత‌ల‌కు భారీ ఊర‌ట ల‌భించిన‌ట్ట‌యింది. ఇదిలావుంటే.. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ తీసుకున్న నిర్ణ‌యం కేసీఆర్‌కు ఇబ్బందులు క‌లిగించే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. కేసీఆర్ ప‌థ‌కానికి రేవంత్ సొమ్ములు చెల్లించిన ఘ‌ట‌న‌ను కేసీఆర్ చేత‌కాని త‌నానికి నిద‌ర్శ‌నం అనేలా కాంగ్రెస్ ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది.

ఏపీలో ఇలా.. !

రేవంత్ రెడ్డి గ‌త ప్ర‌భుత్వం తాలూకు బ‌కాయిల‌ను అంతో ఇంతో అయినా చెల్లించి.. మాన‌వ‌త్వం చాటుకున్నారు. కానీ, ఏపీలో చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన ప‌నుల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు సొమ్ములు చెల్లించేందుకు వైసీపీ ప్ర‌భుత్వం మొండికేసింది. రెండేళ్లు ఎదురు చూసిన కాంట్రాక్ట‌ర్లు.. కోర్టుల‌కు వెళ్లి.. ఉప‌శ‌మ‌నం పొందాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అప్పుడు కూడా ఈ బిల్లుల‌ను తొక్కిపెట్ట‌డం.. క‌మీష‌న్లు గుంచుకోవ‌డం వంటివి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసిన విష‌యం తెలిసిందే.