టీడీపీ నుంచి మ‌రొక‌రు ఔట్‌.. జ‌గ‌నే ఆపుతున్నారా?

రాష్ట్రంలో జంపింగుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ముగ్గురు అధికార వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మాజీలు, ఇత‌ర నాయ‌కులు ఇప్ప‌టికే కండువాలు మార్చేసుకున్నారు. ఈ ప‌రంప‌ర ఇప్ప‌టితో అయిపోయిందా? అంటే.. తాజాగా వ‌స్తున్న వార్త‌ల‌ను బ‌ట్టి.. మ‌రింత మంది టీడీపీ నాయ‌కులు, ఓ న‌లుగురు వ‌ర‌కు చంద్ర‌బాబుకు హ్యాండిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, వీరిలో కొంద‌రు నిర్ణ‌యించుకున్నా.. వివిధ కార‌ణాల‌తో ఇంకా సైకిల్ దిగ‌లేదు.

అయితే, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజక‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది విజ‌యం సాధించిన టీడీపీ నాయ‌కుడు మంతెన‌ రామ‌రాజు మాత్రం ‘నేనొచ్చేస్తా!’ అంటూ రెడీ అయిపోయారు. అయితే, ఈయ‌న రాక‌కు జ‌గ‌న్ అడ్డు చెప్ప‌క‌పోయినా.. ముహూర్తం మాత్రం ఇప్పుడే వ‌ద్ద‌ని అంటున్నారుట‌. ఈ ప‌రిణామాల వెనుక ఏం జ‌రిగింది? బాబుకు ఝ‌ల‌క్ ఇస్తూ.. వ‌చ్చేస్తామంటున్న ఎమ్మెల్యేకు జ‌గ‌న్ ఎందుకు అడ్డు చెబుతున్నారు? అనే సందేహాలు వైసీపీలోనూ వ్య‌క్తమ‌వుతున్నాయి. స‌రే.. ఈ విష‌యం చెప్పుకొనే ముందు.. అస‌లు రామ‌రాజు జంపింగ్ వెనుక కార‌ణాలు తెలుసుకోవాలి.

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు రామ‌రాజు స్నేహితుడు, అప్ప‌టి ఉండి ఎమ్మెల్యే క‌లువ పూడి శివ‌.. త‌న మిత్రుడికి ఎక్క‌డో చోట నుంచి టికెట్ ఇప్పించుకునేందుకు చంద్ర‌బాబును క‌లిశారు. ఈ క్ర‌మంలో అనూహ్యంగా న‌ర‌సాపురం ఎంపీ టికెట్‌ను క‌లువ‌పూడి శివ‌కు కేటాయించిన బాబు.. ఉండి ఎమ్మెల్యే టికెట్‌ను రామ‌రాజుకు ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. క‌లువ‌పూడి శివ ఓడిపోగా.. రామ‌రాజు విజ‌యం సాధించారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య ఒకింత మాట‌లు త‌గ్గాయి. పైగా చంద్ర‌బాబు కూడా ఇక్క‌డి పార్టీ ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

మ‌రోప‌క్క‌, రాజుల కోట‌లో మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజు చ‌క్రం తిప్ప‌డం ఎక్కువైంది. దీంతో రామ‌రాజుకు ఇబ్బందులు ఎదుర‌య్యాయి. రాజుల వ‌ర్గంలోనే ఆయ‌న‌ను ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యారు. ఈ నేప‌థ్యంలో మంత్రి రంగ‌నాథ రాజు సూచ‌న‌ల మేర‌కు రామ‌రాజు పార్టీ మార‌డ‌మే బెట‌ర్ అని భావించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, ఆయ‌న రాక‌ను జ‌గ‌న్ ఒప్పుకుంటున్నా.. ఇప్పుడు మాత్రం వ‌ద్ద‌ని అంటున్నారు. దీనికి కార‌ణం.. ఇప్పుడు రామ‌రాజును తీసుకున్నా.. పెద్ద సంచ‌ల‌నం కాదు. అదే త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో క‌నుక రామ‌రాజుకు తీర్థం ఇస్తే.. బాబుకు ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టు అవుతుంది.. సంచ‌ల‌నంగా మారుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి రామ‌రాజును చేర్చుకోవ‌డం ఖాయ‌మే కానీ, ముహూర్త‌మే కొంచెం ఆల‌స్యం అని అంటున్నారు వైసీపీ నేత‌లు.