‘మోడీ దుర్మార్గుడు.. అందుకే క‌విత‌ను అరెస్టు చేయించాడు!’

బీఆర్ఎస్ పార్టీ కీల‌క‌నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత‌ను ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఈడీ అరెస్టు చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మం లో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. మ‌రోవైపు సీబీఐ సైత‌.. ఆమెపై పంజా విసిరింది. ఈ కేసులు ఎప్ప‌టికి తేలుతాయో కూడా చెప్ప‌డం క‌ష్ట‌మే. అయితే.. సంచ‌ల‌నం రేపిన ఈ కేసుపై క‌విత తండ్రి, బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. క‌విత‌ను అరెస్టు చేసి, జైలుకు త‌ర‌లించి దాదాపు నెల రోజుల‌కు పైగానే అయిపోయినా.. కేసీఆర్ ఎక్క‌డా ఒక్క మాట కూడా అన‌లేదు. అయితే.. తాజాగా ఆయ‌న బీఆర్ ఎస్ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

క‌విత అరెస్టుపై తొలిసారి స్పందించిన కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీపై విరుచుకుప‌డ్డారు. మోడీని దుర్మార్గుడిగా అభివ‌ర్ణించారు. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగానే క‌విత‌ను అరెస్టు చేయించార‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌న ఎమ్మెల్యేల‌ను కొనేందుకు బీఎల్ సంతోష్ వంటి బీజేపీ నాయ‌కులు ప్ర‌య‌త్నించారు. మ‌నం గ‌ట్టిగా ప్ర‌తిఘ‌టించాం. పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనిని మ‌న‌సులో పెట్టుకున్న మోడీ.. ఏదో ఒక‌ర‌కంగా మ‌న‌పై క‌క్ష సాధించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే లిక్క‌ర్ కేసును చూసుకున్నారు. క‌విత‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఏమీ లేదు. అంతా ఉత్తుదే. లిక్క‌ర్ .. బొక్క‌ర్‌లేదు! అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు ప్ర‌స్తుత పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 12-15 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు కార్య‌వ‌ర్గం శ్ర‌మించాల‌ని కేసీఆర్ సూచించారు. అంద‌రూ గెలిచే వాళ్ల‌నే రంగంలో దింపామ‌న్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తే.. గెలుపు పెద్ద క‌ష్టం కాద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పాల‌న‌పై రైతులు, సామాన్య ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతోఉన్నార‌ని.. వారిని మ‌న‌కు అనుకూలంగా మార్చుకుంటే గెలుపు ఈజీ అవుతుంద‌ని తేల్చి చెప్పారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక ఏక‌ప‌క్షం అయ్యేలా కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. ఈ సీటును ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దులు కోకూడ‌దని తేల్చి చెప్పారు.