చంద్ర‌బాబు నోట‌.. స‌ర్వేల మాట‌.. ఎంత జోష్‌గా అంటే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక స‌భ‌ల్లో పాల్గొన్నారు. అనేక ప్ర‌సంగాలు కూడా చేశారు. దాదాపు ఈ షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న 54 స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఉమ్మ‌డిగా మూడు స‌భ‌ల్లో పాల్గొన్నారు. అయితే..ఎప్పుడూ కూడా.. ఆయ‌న నోటి నుంచి స‌ర్వేల మాట రాలేదు. కానీ, తొలిసారి పెడ‌న‌లో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం ఉమ్మ‌డి పార్టీల స‌భ‌లో చంద్ర బాబు స‌ర్వేల మాట ఎత్తారు. మొత్తం 11 స‌ర్వేలు త‌మ‌కే అనుకూలంగా తీర్పు చెప్పాయ‌ని అన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్‌కు ముందు.. త‌ర్వాత జ‌రిగిన స‌ర్వేల్లో 11 సంస్థ‌లు కూట‌మి గెలుస్తుంద‌ని చెప్పాయ‌ని వ్యాఖ్యానించారు.

“కూట‌మి గెలుపున‌కు ఇంత‌కంటే.. ఇంకేం కావాలి. ప్ర‌జ‌లు కూట‌మి త‌ర‌ఫునే ఉన్నారు. రాష్ట్రంలో దుష్ట పాల‌న పోవాల‌నే కోరుకుంటున్నారు. అందుకే కూట‌మికి 11 స‌ర్వేలు అనుకూలంగా వ‌చ్చాయి. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రూ ఆలోచించాల్సి అవ‌స‌రం లేదు. కూట‌మి దే విజ‌యం. ఇంత‌క‌న్నా చెప్పేది లేదు” అని చంద్ర‌బాబు చాలా జోరుగా వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ముఖం వెలిగిపోయింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూట‌మి 17 నుంచి 23 స్థానాలు గెలుస్తుంద‌ని స‌ర్వేలు చెప్పిన‌ట్టు తెలిపారు. ఇక‌, జ‌గ‌న్ పాల‌న‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాలు న‌ష్ట‌పోయాయ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీల‌ను, బీసీల‌ను అడ్డంగా ముంచేశాడ‌ని అన్నారు. మ‌హిళ‌ల‌ను తీవ్రంగా ఇబ్బందులుపెట్టార‌ని.. అన్నారు. అలాంటి వారికే మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి ప‌నికీ లెక్క‌గ‌ట్టి.. స్థానిక ఎమ్మెల్యే(జోగి ర‌మేష్) దోచుకున్నాడ‌ని వ్యాఖ్యానించారు. “నా ఇంటిపైకే దాడి చేయడానికి వ‌చ్చాడు. ఈయ‌న మంత్రి. దాడులు చేసేవారు.. లంచాలు మేసేవారికి ప‌ద‌వులు ఇచ్చిన‌.. జ‌గ‌న్‌.. ఈ రాష్ట్రానికి సీఎం. ఆయ‌నో దౌర్భగ్య ముఖ్య‌మంత్రి” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

కూట‌మి పార్టీలుగా రావాల్సిన అవ‌స‌రం రాష్ట్రంలో క‌ల్పించింది జ‌గ‌నేన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “ఒక దుష్టుడిని త‌రిమి కొట్ట‌డానికి రాముడు అంత‌టి వాడే.. అంద‌రినీ క‌లుపుకొని తాను త‌గ్గి పోరాటం చేసి.. రావ‌ణాసురుడిని అంతం చేశాడు. అలానే మేం కూడా.. చేతులు క‌లిపాం. ప్ర‌జ‌ల కోసం. రాష్ట్రం కోసం.. క‌ల‌సి క‌ట్టుగా ముందుకు వ‌చ్చాం. ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తున్నారు. ఈ ఫ‌లితం స‌ర్వేల్లోనే తేలిపోయింది. ఇక‌, మిగిలింది ఎన్నిక‌లే” అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.