రేవంత్ బీజేపీ ట్రాప్ లో ఉన్నాడా ?

తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్నది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన రేవంత్ ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ ఢిల్లీకి వెళ్లి మోడీని కలవడం, హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోడీ సభలో పాల్గొని భడే భాయ్ అని, మోడీ ఆశీస్సులు కావాలని కోరడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.

ఎన్నికలకు ముందు జరిగిన సభలో రేవంత్ మోడీ సహకారం కోరడం ఈ ఎన్నికల్లో మోడీ గెలిచి మూడోసారి ప్రధాని అవుతాడని పరోక్షంగా ప్రస్తావించడమే అన్న విమర్శలు వచ్చాయి. అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇటీవల ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్తాడని జోస్యం చెప్పగా, తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ‘‘రేవంత్ బీజేపీలో చేరతానంటే స్వాగతిస్తానని, అధిష్టానానికి సిఫార్సు చేస్తానని, అతన్ని చేర్చుకోవాలా ? వద్దా ? అన్న విషయం అధిష్టానం నిర్ణయిస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, అందులో ఉంటే రేవంత్ భవిష్యత్ నాశనం అవుతుందని’’ అన్నారు. ఇప్పటికే రేవంత్ మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం చేకూరుతున్నది.

లోక్ సభ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకుంటే ముఖ్యమంత్రి స్థానం నుండి రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం తప్పిస్తుందన్న వాదనలు ఉన్నాయి. ఈ లోపే తన బలగాన్ని పెంచుకుని ఏ పరిస్థితి ఎదురైనా ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవాలన్న ప్రయత్నాలలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తున్నది. పదే పదే బీజేపీ నేతలు కాంగ్రెస్ లో షిండేలు ఉన్నారని, రేవంత్ పీఠాన్ని వాళ్లు లాక్కుంటారని ఆరోపిస్తున్నారు. తరచూ ఈ వ్యాఖ్యలు విని రేవంత్ అభద్రతా భావంతో ఉన్నట్లు వివిధ వేదికల మీద రేవంత్ మాట్లాడుతన్న మాటలను బట్టి అర్ధమవుతున్నది. అందుకే ఎన్నికల తర్వాత ఏ పరిణామాలు వచ్చినా ఎదుర్కొనే విధంగా రేవంత్ బీజేపీ సహకారం కూడా ఆశిస్తున్నాడా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రేవంత్ సన్నిహితుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ బీజేపీతో టచ్ లో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన దారిలోనే ఎన్నికల తర్వాత రేవంత్ వెళ్తాడా ? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా లోక్ సభ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు తప్పేలా లేవు.