ఫోన్ ట్యాపింగ్ చుట్టూ పాలిటిక్స్‌

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దేశ‌మంత‌టా రాజ‌కీయ వేడి రాజుకుంది. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఉండ‌టంతో ఇక్క‌డ ఆ హీట్ ఇంకా ఎక్కువ‌గానే ఉంది. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ పార్ల‌మెంట్ స్థానాల్లో ఆధిప‌త్యం కోసం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ ఢీ అంటే ఢీ అన‌డంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూనే తిరుగుతోంద‌నే చెప్పాలి. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి మ‌ద్ద‌తుగా, ప్ర‌త్య‌ర్థి నాయ‌కుల‌ను దెబ్బ‌కొట్టేందుకు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కుట్ర‌కు తెర‌లేపింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ కొన‌సాగుతోంది.

మ‌రోవైపు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసే కుట్ర జ‌రుగుతుంద‌నే ఆరోప‌ణ ఏపీ రాజ‌కీయాల్లోనూ క‌ల‌క‌లం రేపింది. గుర్తు తెలియ‌ని ఏజెన్సీల ద్వారా పెగాసెస్ సాఫ్ట్‌వేర్ను వాడి లోకేశ్ ఫోన్‌ను ట్యాప్ చేస్తున్న‌ట్టు యాపిల్ కంపెనీ నుంచి వార్నింగ్ రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ విష‌యాన్ని టీడీపీ నేత‌లు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. తాడేప‌ల్లి ప్యాలెస్ ఆదేశాల‌తోనే టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌తో పాటు న్యాయ‌మూర్తులు, ఎన్నిక‌ల సంఘం అధికారుల ఫోన్ల‌నూ ట్యాప్ చేస్తున్నారని టీడీపీ నేత‌లు ఆరోపించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీ, నిఘా విభాగాధిప‌తి ప్ర‌మేయం లేకుండా ఈ ట్యాపింగ్ జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌ని అంటున్నారు. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అటు తెలంగాణ‌లో ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి వ‌స్తున్న విష‌యాలు సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మెద‌క్ లోక్‌స‌భ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డి డ‌బ్బునే ఎక్కువ‌గా త‌ర‌లించార‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు బీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌ల దాడిని మ‌రింత పెంచారు. ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫోన్ ట్యాపింగ్‌ల క‌ల‌క‌లం రాజ‌కీయంగా ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి.