‘జ‌గ‌న్ ఈ రోజు నాలుగు టీవీలు ప‌గ‌ల‌గొడ‌తాడు’

చంద్రబాబు స్పీచుల్లో మొత్తం మారిపోయింది. గతంలో చెప్పిందే చెప్పి బోర్ కొట్టించే చంద్రబాబు… ఇపుడు ప్రతి చోటా కొత్త సబ్జెక్టు, కొత్తపంచులతో అలరిస్తున్నారు. ఈమార్పుపై కేడర్ ఫుల్ హ్యాపీ. విశ్లేషకులు కూడా చంద్రబాబులో రావల్సిన మార్పు ఇదే అంటున్నారు. తాజాగా ఈరోజు రెండు మూడు చోట్ల చంద్రబాబు మాట్లాడితే అన్ని చోట్లా సబ్జెక్ట్ మారింది. ఉదాహరణకు ఒక చోట బాబు మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ ఈ రోజు నాలుగు టీవీల‌ను ప‌గ‌ల‌గొడ‌తాడ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. కూట‌మి పార్టీల ఉమ్మ‌డి స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాల‌ను చూసి.. జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌న్నారు. రాజ‌ధాని ప్రాంత‌మైన తాడికొండ‌లో నిర్వ‌హించిన స‌భ‌కు జ‌నం పోటెత్తార‌ని.. వీరిని చూసి జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌ద‌ని, అదేవిధంగా ఫ్రెస్ట్రేష‌న్ త‌ట్టుకోలేక‌ నాలుగు టీవీల‌ను కూడా ప‌గ‌ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జన‌సేన జెండాలు ప‌ట్టుకుని సైకిల్ ఎక్కాల‌ని సూచించారు. అదే చేత్తో ఓ గ్లాసును, క‌మ‌లం పువ్వును కూడా తీసుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని అన్నారు. మార్గ‌మ‌ధ్యంలో ద‌ప్పిక వేస్తే.. గాజు గ్లాసుతో నీళ్లు తాగాల‌ని.. టీ తాగాల‌ని అనిపిస్తే.. అదే గ్లాసుతో టీ కూడా తాగాల‌న్నారు. సైకిల్ స్పీడు పెంచి.. తొక్కుకుంటూ పోవాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఎవ‌రైనా అడ్డు వ‌స్తే.. వారి గుండెల్లో గాజు గ్లాసును గుచ్చాల‌ని పిలుపునిచ్చారు. మిగ‌తాది తాను చూసుకుంటాన‌ని చంద్ర‌బాబు సూచించారు.

ఈ ద‌ఫా అసెంబ్లీలో తొలి అడుగు త‌న‌దేన‌ని చంద్ర‌బాబు అన్నారు. రెండేళ్ల కింద‌ట తాను అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోన‌ని వాగ్దానం చేశాన‌ని గుర్తు చేశారు. కౌర‌వ స‌భ‌లో ఉండ‌న‌ని.. గౌర‌వ స‌భ‌లోనే ఉంటాన‌ని ఆనాడు శ‌ప‌థం చేసిన‌ట్టు తెలిపారు. వ‌చ్చేది కూట‌మి ప్ర‌భుత్వ‌మేన‌ని.. కాబ‌ట్టి గౌర‌వ స‌భ ఏర్పాట‌వుతుంద‌ని చెప్పారు. ఆ గౌర‌వ స‌భ‌లో తానే తొలి అడుగు వేస్తాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల ఉత్సాహం చూస్తుంటే..జూన్ 4వ తేదీ(పోలింగ్ రిజ‌ల్ట్ వ‌చ్చే రోజు) కోసం ఎదురు చూస్తున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌న్నారు.

కాగా.. వైసీపీ స‌భ‌ల‌కు పెద్ద ఎత్తున డ‌బ్బులు పారిస్తున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక్కొక్క స‌భ‌కు 20 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీని పూర్తిగా వైసీపీ ఆర్టీసీగా మార్చేశార‌ని.. ఎక్క‌డ స‌భ జ‌రిగినా ఆర్టీసీ బ‌స్సులు పంపిస్తున్నార‌ని.. దీంతో ప్ర‌యాణికులు నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ ఆగ్ర‌హం.. ఈ ఆక్రోశం.. మే 13న జ‌రిగేఎన్నిక‌ల్లో బ‌ట‌న్లను నొక్క‌డం ద్వారా చూపించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.