ఇంట్రెస్టింగ్: షర్మిల వైపుకు మహిళా ఓటర్లు.!

కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ కంటూ ప్రస్తుతం ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఏమీ లేదు. అదెప్పుడో వైసీపీకి బదిలీ అయిపోయింది. అలా బదిలీ అయిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కొంతైనా రాబట్టగలననే విశ్వాసంతో కనిపిస్తున్నారు వైఎస్ షర్మిల.

తన అన్న తనను గోడకేసి కొట్టారనీ, తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషుల్ని తన అన్నే కాపాడుతున్నారనీ వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మహిళా ఓటర్లలో కొందరు, షర్మిల వైపు ‘సానుభూతి’తో చూస్తున్నారట.

కాంగ్రెస్ పార్టీ తాజాగా కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల గెలిచే అవకాశం లేకపోయినా, వైసీపీ ఓటు బ్యాంకుని ఆమె గట్టిగానే చీల్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయమై వైసీపీ శ్రేణుల్లో ఒకింత అలజడి కనిపిస్తోంది. పులివెందుల వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కూడా అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా, ఈ విషయమై షర్మిల నుంచి షాక్ తగలబోతోందిట.

దాంతో, పార్టీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మంతనాలు జరుపుతున్నారట కూడా. వైసీపీకి సంబంధించి కడపలో మహిళా ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితులోనూ చీలిపోకుండా వుండాలంటే, విజయమ్మను తీసుకురావాలనే డిమాండ్ వైసీపీలో పెరుగుతోంది. కానీ, ఆమె అందుకు ఒప్పుకుంటారా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.