జగన్ కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నాడా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు ఉదయం నుంచి ఇదే హాట్ టాపిక్. వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి మారుతున్నాడనే ప్రచారం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండగా.. అక్కడక్కడా ప్రధాన పార్టీలు అభ్యర్థులు అటు ఇటు మారుస్తుండడం చూస్తున్నాం. వైసీపీలో ఈ ఒరవడి ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజల పరిణామాలతో కడప పార్లమెంట్ స్థానం విషయంలో జగన్‌ కొంత కలవరడపుతున్నారని.. అందుకే తనకు సోదరుడి వరసయ్యే సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి వైఎస్ కుటుంబానికే చెందిన అభిషేక్ రెడ్డిని అభ్యర్థిగా చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అవినాష్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అవినాష్‌తో పాటు జగన్‌ను ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిళ.. వివేకా తనయురాలు సునీత గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వివేకాను చంపిన అవినాష్ కావాలా.. న్యాయం కోసం పోరాడుతున్న తాను కావాలా తేల్చుకోమంటూ జనాల్లోకి వెళ్తున్నారు షర్మిళ.

వివేకా హత్య కేసులో ఇప్పటికే చాలా డ్యామేజ్ జరగ్గా.. అవినాష్‌నే కొనసాగిస్తే అది మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో జగన్‌ అభ్యర్థిని మార్చడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. కానీ ఇందుకు వైఎస్ భారతి ఒప్పుకుంటుందా అనే చర్చా జరుగుతోంది. వైఎస్సార్, జగన్‌ ఎంపీలుగా ఉన్న కడప సీటు వారి తర్వాత అవినాష్‌కు దక్కడంలో భారతి పాత్ర కీలకం అంటారు. మరి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అయిన అవినాష్‌ను పక్కన పెడుతుంటే ఆమె ఊరుకుంటారా అన్నది ప్రశ్నార్థకం. ఇంతకీ ఈ ప్రచారంలో ఎంతమేర నిజం ఉందన్నది చూడాలి.