జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, సమీకరణాలు కుదరకపోవడం వల్ల చివరకు నాగబాబు ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగబాబుకు మంత్రి పదవి లేకపోయినప్పటికీ కేబినెట్ హోదా దక్కిన వైనం చర్చనీయాంశమైంది. నాగబాబును ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా నియమించిన ఏపీ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కల్పించడంపై చర్చ జరుగుతోంది.
మామూలుగా అయితే, ఈ తరహా పదవులు, కేబినెట్ హోదాలు ఏ ప్రభుత్వానికైనా కొత్త కాదు. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ తరహా నియామకాలకు వ్యతిరేకం అని గతంలో చెప్పిన నేపథ్యంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ నుంచి నాగబాబుకు కేబినెట్ హోదా దక్కడంతో వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ నాగబాబును ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పుడే జనసేనలో సైతం కొందరు నేతలు నర్మగర్భంగా పెదవి విరిచారు.
అటువంటిది ఇప్పుడు ఏకంగా కేబినెట్ హోదా కల్పిస్తూ నాగబాబుకు ఆ పదవి ఇవ్వడంపై కూడా కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ పాలనకు వ్యతిరేకం అని చెప్పిన పవన్ తన సోదరుడికి ఎమ్మెల్సీ ..తద్వారా కేబినెట్ ర్యాంక్ పదవి కట్టబెట్టడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా కష్టపడి జనసేన కోసం పాటుబడిన కొందరు నేతలకు ఎటువంటి పదవులు దక్కలేదని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల జనసేన నేతలు, కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని అంటున్నారు.
అయితే ఒక బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనతోనే నాగబాబుకు ఈ పదవి ఇచ్చారని, ఒకరకంగా ఇది మంచి ఆలోచనే మాట కూడా వినిపిస్తుంది. పొత్తు ధర్మంలో భాగంగా తన ఎంపీ సీటును సైతం త్యాగం చేసిన నాగబాబుకు పవన్ ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా అంటూ కొందరు జనసైనికులు ఈ పవన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates