చింత‌మ‌నేనిపై సానుభూతి.. గెలిస్తే గిఫ్ట్‌తో బాబు రెడీ

ఈ సారి దెందులూరు ఎమ్మెల్యేగా చింత‌మ‌నేని ప్రభాక‌ర్ గెలుపు ఖాయ‌మా? అది తెలిసే చంద్ర‌బాబు ఆయ‌న‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇస్తా అన్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని గెలిచేందుకు మెరుగైన అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ మ‌రోసారి టీడీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. దూకుడైన రాజ‌కీయ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న చింత‌మ‌నేనికి.. ఇచ్చిన మాట త‌ప్ప‌ర‌నే పేరుంది.

టీడీపీ నుంచి రెండు సార్లు దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన చింత‌మ‌నేనికి 2019లో ప‌రాజ‌యం ఎదురైంది. అప్పుడు వైసీపీ అభ్య‌ర్థి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి చేతిలో చింత‌మ‌నేని ఓడిపోయారు. ఈ ఓట‌మి నుంచి కోలుకునేందుకు కాస్త స‌మ‌యం తీసుకున్న ఆయ‌న‌.. తిరిగి వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్ అయ్యారు. అక్క‌డ టీడీపీ క్యాడ‌ర్ ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చూసుకున్నారు. ప్ర‌జల్లో ఉంటూ టీడీపీ ఓటు బ్యాంకు దెబ్బ‌తిన‌కుండా జాగ్ర‌త్త వ‌హించారు. ఇప్పుడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో చింత‌మ‌నేని విజ‌యంపై ధీమాతో ఉన్నార‌ని స‌మాచారం.

మ‌రోసారి వైసీపీ నేత అబ్బ‌య్య చౌద‌రిని ఢీ కొడుతున్న చింత‌మ‌నేని గెలిచి రివేంజ్ తీసుకోవాల‌నే టార్గెట్ పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌తో అబ్బ‌య్య గెలిచారు కానీ ఆయ‌న క‌ష్ట‌మేమీ లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక గెలిచిన త‌ర్వాత అబ్బ‌య్య ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా రాలేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. దీంతో గ్రౌండ్ లెవ‌ల్‌లో ప‌రిస్థితి చూస్తే చింత‌మ‌నేనిపై ప్ర‌జ‌ల‌కు సానుభూతి క‌లుగుతోంద‌ని తెలిసింది. ఆయ‌న‌పై మ‌ళ్లీ జ‌నాద‌ర‌ణ పెరిగింద‌ని ఈ సారి విజ‌యం ప‌క్కా అని చెబుతున్నారు. స‌ర్వేల ద్వారా బాబుకు ఇదే తెలిసింద‌ని, అందుకే ఈ సారి చింత‌మ‌నేని గెలిస్తే గిఫ్ట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని టాక్‌. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో చింత‌మ‌నేని విప్‌గా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.