ఇంకా ఎనీ డౌట్స్‌.. రోడ్ షోతో అన్నీ ఢ‌మాల్‌!

డౌట్ల‌న్నీ క్లియ‌రైపోయాయి. సందేహాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క్లియ‌ర్ మెసేజ్ అందుకున్నారు. ఒక్క రోడ్ షోతో ఈ కూట‌మిపై ఆయా పార్టీల నేత‌ల‌కు మ‌రింత న‌మ్మ‌కం క‌లిగింద‌నే చెప్పాలి. అవును.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి క‌లిసి రోడ్‌షోలో పాల్గొన‌డంతో కూట‌మికి ప‌రిస్థితులు మ‌రింత అనుకూలంగా మారాయ‌నే చెప్పాలి. ఏపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ ప‌రిణామం కీల‌కంగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మూడు పార్టీలు క‌లిసే పోటీ చేస్తాయ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఇన్ని రోజులు ఎవ‌రికి వారే అన్న‌ట్లు ఉండ‌టంతో సందేహాలు రేకెత్తాయి.

రాష్ట్ర భ‌విష్య‌త్ కోస‌మంటూ టీడీపీ, జ‌న‌సేన తిరిగి జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వీళ్ల‌తో పాటు బీజేపీ కూడా చేరింది. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు త‌క్కువ టికెట్లు కేటాయించ‌డంపై ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కొన్ని చోట్ల టీడీపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ప‌రస్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డంతో పాటు దాడుల‌కూ దిగారు. ఈ అవ‌కాశాన్ని వాడుకున్న అధికార వైసీపీ.. కూట‌మిలోని పార్టీల సీటు త‌గాదాలు అంటూ వైర‌ల్ చేసేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ ఓ వైపు నుంచి బాబు, మ‌రోవైపు నుంచి ప‌వ‌న్ త‌మ త‌మ పార్టీ నేత‌ల‌ను బుజ్జ‌గించి దారికి తెచ్చుకున్నారు. చెప్పినా విన‌ని వాళ్ల‌ను వ‌దిలేసుకున్నారు. కానీ ప్ర‌జ‌ల్లో మాత్రం కూట‌మిపై పూర్తిగా న‌మ్మ‌కం క‌ల‌గ‌ని ప‌రిస్థితి ఉండేది. బాబు వేరుగా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తుండ‌టం.. ప‌వ‌న్ ఒంట‌రిగానే సాగ‌డంతో ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కానీ త‌ణుకు నుంచి నిడ‌ద‌వోలుకు బాబు, ప‌వ‌న్‌, పురందేశ్వ‌రి క‌లిసి రోడ్ షో చేయ‌డంతో అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వ‌చ్చేశాయి. ఈ రోడ్ షోతో కూట‌మిపై ప్ర‌జ‌ల్లో మ‌రింత న‌మ్మ‌కం పెరిగింది. మ‌రోవైపు మూడు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌కూ కొత్త జోష్ వ‌చ్చింది. ఈ మూడు పార్టీల మ‌ధ్య విభేధాలు ఉన్నాయంటూ ప్ర‌చారం చేస్తున్న వైసీపీకి ఆ అవ‌కాశం లేకుండా చేయ‌డంలోనూ రోడ్‌షా విజ‌య‌వంత‌మైంద‌నే చెప్పాలి. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య టికెట్ల వార్ జ‌రుగుతుంద‌ని, ఈ కూట‌మిని న‌మ్మొద్దంటూ సోష‌ల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ఫేక్ ప్ర‌చారం చేస్తుందంటూ ఈ రోడ్ షా సంద‌ర్భంగా బాబు మండిప‌డ్డారు. మూడు పార్టీలు క‌లిసే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఒక్క‌ట‌య్యాయ‌ని, కూట‌మి అధికారంలోకి క‌చ్చితంగా వ‌చ్చి తీరుతుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. దీంతో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌రింత దూకుడుతో సాగేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది.