ఆర్ఆర్ఆర్ తుల‌సి మొక్కే.. పార్ల‌మెంటే చెప్పింది!

వైసీపీ రెబ‌ల్ ఎంపీగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం పొందిన న‌రసాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ రాజు.. త‌న‌ను తాను.. గంజాయి వ‌నంలో తుల‌సి మొక్కని అని ప‌దే ప‌దే చెప్పుకొన్నారు. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన 22 మంది ఎంపీలో తాను ఒకడిని కాద‌ని.. తాను ప్ర‌త్యేక‌మ‌ని చెప్పుకొనేవారు. అయితే.. దీనిని కొంద‌రు యాక్సెప్ట్ చేసేవారు.. మ‌రికొంద‌రు తోసిపుచ్చేవారు. అయితే.. ఇప్పుడు పార్ల‌మెంటు రికార్డులు.. ఆర్ ఆర్ ఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పార్ల‌మెంటుకు ఎన్నికైన 25 మంది ఎంపీల్లో ఆర్ ఆర్ ఆర్‌.. నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉన్నార‌ని.. పార్ల‌మెంటు స్ప‌ష్టం చేసింది. తాజాగా ఈ ఐదేళ్ల కాలంలో ఎంపీల పెర‌ఫార్మెన్స్‌, పార్లమెంటు కు హాజ‌రైన ప‌నిదినాలు వంటివాటి వివ‌రాల‌ను రాష్ట్రాల వారీగా పార్ల‌మెంటు స‌చివాల‌యం విడుద‌ల చేసింది. దీంతో ఏపీ నుంచి ఆర్ ఆర్ ఆర్ ఒక్క‌రే 98 శాతం అటెండెన్స్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయ‌న కేవ‌లం రెండు సంద‌ర్భాల్లో మాత్ర‌మే స‌భ‌ల‌కు హాజ‌రు కాలేక పోయార‌ని తెలిపింది.

అంతేకాదు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌ర్వాత‌.. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన ఎంపీల్లోనూ ఆయ‌నే ముందు వ‌రుస‌లో రికార్డు స్థాయి అటెండెన్సును, పెర‌ఫార్మెన్సును సొంతం చేసుకున్నార‌ని పార్ల‌మెంటు స‌చివాల‌యం స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత‌.. రెండో స్థానంలో గుంటూరు ఎంపీ(టీడీపీని వ‌దిలేశారు) గ‌ల్లా జ‌య‌దేవ్ రెండో స్థానంలో ఉన్న‌ట్టు పార్ల‌మెంటు నివేదిక స్ప‌ష్టం చేసింది. ఈయ‌న 87 శాతం అటెండెన్స్‌తో రెండో ప్లేస్‌లో ఉన్నార‌ని తెలిపింది.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున నిప్పులు చెరిగి.. విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించే బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ చిట్ట‌చివ‌రి స్థానంలో ఉన్నార‌ని పార్ల‌మెంటు తెలిపింది. ఈయ‌న హాజ‌రు శాతం కేవ‌లం 35 శాతంగా ఉంద‌ని పార్ల‌మెంటు పేర్కొంది. ఇక‌, 22 మంది వైసీపీ ఎంపీల్లో గొట్టేటి మాధ‌వి(అర‌కు) మాత్రం మూడో స్థానంలో ఉన్నార‌ని తెలిపింది. ఈమె 86 శాతం అటెండెన్సును సొంతం చేసుకున్నారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్‌పై పోటీ చేస్తున్న కాకినాడ ఎంపీ వంగా గీత 85 శాతం అటెండెన్సు సొంతం చేసుకున్నారు. విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నాని హాజ‌రు శాతం 81 శాతంగా ఉంద‌ని పార్ల‌మెంటు పేర్కొంది. ఇక‌, వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి హాజ‌రు శాతం 42 శాతం గా ఉంద‌ని పార్ల‌మెంటు తెలిపింది.