ఏపీ సీఐడీ కీల‌క ప‌త్రాల ద‌హ‌నం..!

ఏపీ సీఐడీకి చెందిన కీల‌క అధికారి ఒక‌రు స్వ‌యంగా కొన్ని ప‌త్రాల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ ద‌హ‌నం చేస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ గ‌త నాలుగేళ్ల‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్రంగానే ప‌నిచేసింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. వారిని అరెస్టు చేసేందుకు ఏవేవో కేసుల‌ను త‌వ్వి తీశార‌ని అప్ప‌ట్లో టీడీపీ కూడా విమ‌ర్శ‌లు గుప్పించింది.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపై కేసులు బ‌నాయించి.. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం 53 రోజులు రాజ‌మండ్రి జైల్లో ఉంచ‌డం తెలిసిందే. అయితే, కోర్టుల జోక్యంతో ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది. ఇక‌, నారా లోకేష్‌పై హెరిటేజ్ కేసులు, ఫైబ‌ర్ నెట్ కేసులు ప‌రిశోధ‌న‌ల జాబితాలో ఉన్నాయి. ఇప్ప‌టికి రెండు మూడు సార్లు లోకేష్ను కూడా విచారించారు. అరెస్టు చేస్తార‌నే చ‌ర్చ కూడా సాగింది. అయితే.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌లేదు.

ఇక‌, ఇప్పుడు సీఐడీ సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలను ఒక అధికారి ద‌హ‌నం చేస్తుండ‌డం.. నిప్పు రాజేయ‌డం.. ద‌గ్గ‌ర‌కు ఎవ‌రినీ రాకుండా.. జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చూస్తే.. వీటి వెనుక ఏదో కుట్ర జ‌రుగుతోంద‌ని రాజ‌కీయ పార్టీలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. గతంలో సృష్టించిన నకిలీ ఆధారాలు, న‌కిలీ ప‌త్రాల‌ను బయట పడకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పత్రాల తగలబెట్టే వ్యవహారం చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇక‌, ఇవ‌న్నీ.. సీఐడీ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో జ‌రుగుతున్నాయ‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ప‌త్రాల ద‌హ‌నం.. రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఎన్నిక‌ల‌కు ముందు ఇది ఎలాంటి దారి మ‌ళ్లిస్తుందో చూడాలి.