గంగిరెడ్డి తుడిచేస్తుంటే.. అవినాశ్ రెడ్డి చూస్తూ ఉండిపోయారట

ఏం ఆలోచిస్తారో? అర్థం కాదు కానీ కొందరు నేతల తీరు.. వారి మాటలు ఆశ్చర్యకరంగానే కాదు.. కూసింత తెలివి ఉన్నప్పటికీ ఇలా ఎలా మాట్లాడతారు? అన్న సందేహం కలిగేలా ఉంటాయి. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్య ఉదంతం హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ఈ అంశంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిన ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కాస్తంత ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం వైఎస్సార్ జిల్లాలోని వీరపునాయునిపల్లి మండలం మొయిళ్లకాల్వలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో తన పక్కనే కూర్చున్న అవినాశ్ రెడ్డిని చూపిస్తూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవీంద్రనాథ్ మాటల్ని యథాతధంగా.. ఎలాంటి వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు లేకుండా ఇస్తాం. వాటిని చదివిన తర్వాత మీకు.. మీ మనసుకు ఏమనిపిస్తే అదే సరైనది.

తన ప్రసంగంలో భాగంగా రవీంద్రనాధ్ రెడ్డి ఏమన్నారంటే.. ‘‘హత్య జరిగిన తర్వాత శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేస్తే అవినాశ్ ఘటనాస్థలానికి వెళ్లాడు. గంగిరెడ్డి ఏదో చేస్తుంటూ అవినాశ్ అమాయకంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. అంతే తప్పించి.. హత్యకు సంబంధించిన ఆధారాల్ని అవినాశ్ తుడవలేదు. హత్యలో గంగిరెడ్డి పాత్ర అయితే కచ్ఛితంగా ఉంది. గంగిరెడ్డి.. వివేకానందరెడ్డి ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఒకటే మంచంలో పడుకొని.. ఒకటే పళ్లెంలో తినేంత సన్నిహితులు. గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాశ్ ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏదో చేస్తున్నాడని అనుకొని ఉండొచ్చు. అక్కడ అమాయకంగా నిలబడిపోయిన అవినాశ్.. ఈ విషయం ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు.

తనకు బాబాయ్ అయ్యే వివేకా దారుణంగా హత్యకు గురైనప్పుడు.. క్రైం సీన్ లో ఉన్న వారెవరు వాటిని ముట్టుకోకూడదని.. అక్కడి ఆధారాలు చెదిరిపోకుండా చూడాలన్న ఆలోచన చిన్న పిల్లాడికైనా ఉంటుంది. మరి.. అవినాశ్ లాంటి వ్యక్తికి అలాంటి ఆలోచన తట్టకపోవటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం వెతకితే చాలానే చిక్కుముళ్లు ఇట్టే వీడిపోతాయన్నది మర్చిపోకూడదు.