ఇంతకీ రాజుగారు పార్టీలో ఉన్నట్లా ? లేనట్లా ? ప్రజల్లో అయోమయం

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం ఎంపి గా గెలిచిన తర్వాత నుండి ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు, అధినేత జగన్మోహన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయింది. దాంతో ఎంపి-పార్టీ నేతల మధ్య ప్రతిరోజు టామ్ అండ్ జెర్రీ షో జరుగుతోంది. ఎంపి ఏమో ప్రతి విషయంలోను పార్టీని, జగన్ను విమర్శిస్తున్నారు. వెంటనే పార్టీ నేతలు ఎంపిపై ఎదురుదాడితో విరుచుకుపడిపోతున్నారు. మొత్తానికి ఎంపి అయితే పార్టీలో ఉండే పరిస్ధితులు లేవని అర్ధమైపోయింది. అందుకనే చాలాకాలంగా వైసిపి నుండి తనపై బహిష్కరణ వేటు వేయించుకునేందుకు నరసాపురం ఎంపి తెగ ప్రయత్నిస్తున్నారు.

అయితే ఎంపి ఆశించినట్లు కాకుండా తనపై బహిష్కరణ వేటుకి పార్టీ ప్రయత్నిస్తోంది. ఎంపిపై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ తరపున లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేశారు. సరే ఆ ఫిర్యాదు ఏ స్ధితిలో ఉందో ఎవరికీ తెలీదు. ఇదిలా ఉండగానే సోమవారం నుండి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్టీ ఎంపిలతో సిఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపిలందరికీ సమాచారం అందినట్లే నరసాపురం ఎంపికి కూడా అందింది. అయితే తర్వాత కొంతసేపటికి మళ్ళీ పార్టీ నుండి ఫోన్ చేసి మీరు సమావేశానికి రావద్దంటూ చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపినే ఢిల్లీలో మీడియాకు చెప్పారు. దాంతో తనను పార్టీ బహిష్కరించిందని తాను అనుకుంటున్నట్లు చెప్పటమే కొసమెరుపు.

బహిష్కరణ వేటు వేయించుకునేందుకు ఎంపి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ? అనర్హత వేటు వేయించేందుకు పార్టీ ఎందుకు ప్రయత్నిస్తున్నాయి ? అనేది చాలా కీలకం. పార్టీ గనుక ఎంపిని సస్పెండ్ చేసినా బహిష్కరించినా కృష్ణంరాజు స్వేచ్చాజీవి అయిపోతారు. ఇపుడు ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారో ఇకపై ఇంతకన్నా రెచ్చిపోయి మాట్లాడినా ఎంపిని ఎవరు ఏమి చేయలేరు. అదే పార్టీ నాయకత్వం కోరుకుంటున్నట్లుగా స్పీకర్ గనుక ఎంపిపై అనర్హత వేటు వేస్తే కృష్ణంరాజు సభ్యత్వం రద్దయిపోతుంది. అప్పుడు నరసాపురం లోక్ సభ స్ధానానికి ఉపఎన్నికలు వస్తాయి. అప్పుడు కృష్ణంరాజు కతేంటో తేలిపోతుంది. పార్టీ వల్లే కృష్ణంరాజు ఎంపిగా గెలిచారా ? లేకపోతే కృష్ణంరాజు పార్టీ తరపున పోటి చేయబట్టే పార్టీ ఇక్కడ గెలిచిందా ? అనేది తేలిపోతుంది.

తాను పార్టీ తరపున అభ్యర్ధిగా పోటి చేయబట్టే పార్టీ ఇక్కడ గెలిచిందని ఎంపి మొదటినుండి చెబుతున్నారు. తనను బతిమలాడి పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారని రాజుగారు చెబుతున్న విషయం తెలిసిందే. కృష్ణంరాజుకు అంత సీన్ లేదని వైసిపి తరపున పోటి చేయకపోతే గెలుపు అవకాశమే లేదంటూ ఎంఎల్ఏలు, నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఏ విషయమూ తేలిపోవాలంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటి చేయమని ఎంఎల్ఏలు ఛాలెంజ్ చేస్తున్నా ఎంపి పట్టించుకోవటం లేదు. దాంతోనే ఎంపి స్టాండ్ ఏమిటో తేలిపోతోంది.