పింఛ‌ను సొమ్ముతో ఉద్యోగి ప‌రార్‌.. ఇది కూడా రాజ‌కీయం!

ప్ర‌స్తుతం ఏపీలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారిన విష‌యం తెలిసిందే. పింఛన్లను ఇంటింటికీ తీసుకువెళ్లి ఇవ్వ‌కుండా టీడీపీ అడ్డు ప‌డుతోంద‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తుంటే.. అదేంలేదు.. వైసీపీనే ఉద్దేశ పూర్వ‌కంగా ఆల‌స్యం చేస్తూ.. టీడీపీపై నెడుతోంద‌ని తెలుగుదేశం త‌మ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇలాసాగుతుంటూ.. ఇప్పుడు మ‌రో విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. పింఛ‌న్ల పంపిణీ కోసం.. బ్యాంకు నుంచి తీసుకువ‌చ్చిన సొమ్మును స‌చివాల‌య ఉద్యోగి ఒక‌రు త‌స్క‌రించారు.

ఈ ఉద్యోగి టీడీపీ సానుభూతిప‌రుడ‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తే.. టీడీపీ నేత‌లు..కాదు.. ఆయ‌న అన్న వైసీపీలో కార్య‌క‌ర్త‌గా ఉన్నాడంటూ.. టీడీపీ నాయ‌కులు ఎదురు దాడి చేస్తున్నారు. ఈ దొంగ‌త‌నం కూడా రాజ‌కీయంగా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. ఏం జ‌రిగిందంటే.. పింఛ‌న్ల సొమ్ము పంపిణీ కోసం.. బ్యాంకుల నుంచి సచివాల‌యాల‌కు.. పింఛ‌ను దారుల జాబితా ఆధారంగా సెర్ప్ విభాగం నిధుల‌ను పంపిణీ చేస్తోంది. ఈ నిధుల‌ను బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

దీంతో విజ‌య‌వాడ, మ‌ధురాన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన స‌చివాల‌య ఉద్యోగి నాగ మ‌ల్లేశ్వ‌ర‌రావు.. శుక్ర‌వారం ఉద‌యం బ్యాంకుకు వెళ్లి సొమ్ము తెచ్చుకుని.. అటు నుంచి అటే ఉడాయించాడు. దీంతో పింఛ‌న్ల కోసం వేచి చూసిన ల‌బ్ధిదారులు ఎంత‌కీ.. మ‌ల్లేశ్వ‌ర‌రావు రాక‌పోవ‌డంతో ఉన్న‌తాధికారుల ముందు గోడు వెళ్ల‌బోసుకున్నారు. దీంతో మ‌ల్లేశ్వ‌ర‌రావుకు ఫోన్ చేయ‌గా.. స్విచ్ఛాఫ్ అని వ‌చ్చింది. అప్ప‌టికి బ్యాంకు నుంచి సొమ్ము తీసుకున్నాడ‌ని.. బ్యాంకు అధికారులు కూడా చెప్పారు. దీంతో నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు డ‌బ్బుతో ఉడాయించాడ‌ని పేర్కొంటూ అధికారులు కేసు పెట్టారు.

ఇదిలావుంటే, మ‌ల్లేశ్వ‌ర‌రావు.. టీడీపీ సానుభూతిప‌రుడ‌ని వైసీపీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి వెల్లంపల్లి శ్రీనివాస‌రావు ఆరోపించారు. దీనివెనుక కుట్ర ఉంద‌ని.. చంద్ర‌బాబే ఇలా చేయించాడని .. ఆయ‌న ప్ర‌ధాన మ‌ద్ద‌తు దారు.. స‌చివాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. దీంతో టీడీపీ నేత‌లు ఎదురు దాడి చేశారు. నాగ‌మ‌ల్లేశ్వ‌రావు సోద‌రుడు వైసీపీ నాయ‌కుడ‌ని.. అందుకే ఇంత ధైర్యంగా సొమ్ము దోచేశాడ‌ని ఆరోపించారు. ఇదీ.. సంగ‌తి. వీరిద్ద‌రి ఘ‌ర్ష‌ణ‌ల‌తో పింఛ‌న్ దారులు మండుటెండ‌లో అవ‌స్థ‌లు ప‌డ్డారు.