ఔను.. ద‌స్త‌గిరి చెప్పింది నిజ‌మే..

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి దారుణ‌ హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ నాయ‌కుడు, క‌డప ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవ‌ర్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ స‌మ‌యంలో హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అవినాష్‌ రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించాడంటూ దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిని సీబీఐ కూడా అంగీక‌రించింది.

అంతేకాకుండా, అవినాష్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నార‌ని ద‌స్త‌గిరి పిటిష‌న్‌లో పేర్కొన్నా డు. తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేసి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి వివరించా డు. అయితే.. ఈ పిటిష‌న్‌పై విచారించిన కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. సీబీఐని నిల‌దీసింది. అప్రూవ‌ర్‌గా ఉన్న‌ దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ప్ర‌శ్నించింది.

సీబీఐ స్పందిస్తూ, దస్తగిరి వాదనను సమర్థిస్తున్నామని బదులిచ్చింది. మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కానీ, తమ కంటే ముందే వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారని సీబీఐ సమాధానమిచ్చింది. సుప్రీంలో ఆమె పిటిషన్ పై విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపిస్తామని సీబీఐ వివరణ ఇచ్చింది. దస్తగిరి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.

వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు దస్తగిరి పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. అటు, వివేకా హత్య కేసులో ఇతర నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, జి.ఉదయ్ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.