టాలీవుడ్ కోరుకున్నది పవన్ వల్ల జరుగుతుందా

జనసేన కార్యకలాపాల కోసం షూటింగులకు బ్రేక్ ఇచ్చి తన దర్శకులను ఇతర సినిమాలు చేసుకోమని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రయాణం వైపు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం కనక ఏర్పడితే వేల కోట్ల పెట్టుబడులతో ముడిపడిన ప్యాన్ ఇండియా సినిమాలకు మేలు జరుగుతుందనే ఆశ బలంగా కనిపిస్తోంది. అదెలాగో చూద్దాం. ప్రస్తుతం ఏపీలో టికెట్ రేట్ల పెంపుకి సంబంధించిన ప్రహసనం క్లిష్టంగా ఉంది. అందుకే మరీ తప్పదనుకుంటే తప్ప నిర్మాతలు హైక్ కోసం అప్లై చేయడం లేదు. తెలంగాణలో అలాంటి ఇబ్బందులు లేవు.

ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి రేంజ్ సినిమాలకు తప్ప మిగిలినవాటికి పెంపు ఇవ్వడానికి ఏపీలో సవాలక్ష అడ్డంకులు వస్తున్నాయి. అంత సలార్ కే కేవలం 50 రూపాయలతో సర్దుకోవాల్సి వచ్చింది. పెంచిన ఏపీ సినిమా టికెట్ కంటే తెలంగాణ సాధారణ రోజుల్లో ఉండే మల్టీప్లెక్స్ టికెట్ వంద రూపాయలు ఎక్కువగా ఉండటం దానికి నిదర్శనం. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ ముఖ్యమంత్రి కాకపోయినా తన మాటకు ఎంతో విలువిచ్చే చంద్రబాబునాయుడు నిర్ణయాలు ఖచ్చితంగా ఇండస్ట్రీకి మేలు కలిగేలా ఉంటాయి. సో అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ధరలు ఉండొచ్చు.

ప్రొడ్యూసర్లు కోరుకుంటున్నది ఇలాంటి పరిణామమే. ఇందులో లోతైన రాజకీయం లేదు కానీ గత రెండు మూడేళ్ళుగా కలెక్షన్ల కోణంలో నిర్మాతలు ఏపీ నుంచి సరైన రెవిన్యూ అందుకోవడం లేదు. ఈ సమస్య వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ల నుంచి మొదలై ఇతరులను కూడా వెంటాడుతూనే ఉంది. సంక్రాంతికి మినహాయించి మిగిలిన రోజుల్లో టికెట్ల పెంపు అడిగే సాహసం చేయలేకపోతున్నారు. తెలంగాణ తరహాలో గరిష్ట ధరను పెంచాలని ఎదురు చూస్తున్నారు. పవన్ వల్ల ఈ సమస్య పరిష్కారమయ్యేదే కానీ అది తేల్చాల్సింది ఓటర్లు, నిర్ణయించబడేది ఎన్నికల ఫలితాల తర్వాత.