‘వైనాట్ 175’ పోయింది.. ఇప్పుడు ‘వైనాట్ 200’

వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఎన్నిక‌ల‌కు ముందు… ఇప్పుడు షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా.. వైనాట్ 175 అనే మాట‌నే మాట్లాడుతున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న బ‌స్సు యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మం లో క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్తితిని గ‌మ‌నిస్తున్నారో.. లేక ఆయ‌న‌లో మ‌రింత భ‌రోసా ఏర్ప‌డిందో తెలియ‌దు కానీ.. ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.. అదే డ‌బుల్ సెంచ‌రీ. ఔను.. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ప్ర‌సంగాలు వింటే.. ఇదే స్ప‌ష్టంగా చెబుతున్నారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు మాత్ర‌మే ఉన్నాయి. మ‌రి 200 స్థానాలు ఎక్క‌డివి? అనే సందేహం రావొచ్చు. మ‌రో 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిని కూడా వాటితో క‌లిపి.. మొత్తం 200 స్థానాలుగా జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్పుడు డ‌బుల్ సెంచ‌రీ నినాదంతో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. పెత్తందారులకు, సామాన్యులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అని పదే పదే ప్రస్తావిస్తున్నారు.

క‌డ‌ప నుంచి మదనపల్లె వ‌ర‌కు ఎక్క‌డ ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ నిర్వ‌హించినా.. సీఎం జగన్ మాట్లాడుతూ.. వైనాట్ 175 కాదు, ఏపీలు డబుల్ సెంచరీ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ `వైనాట్ 200“ అనే కొత్త ప‌ల్ల‌వి అందుకుంటున్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాల్ని దూరం చేయడమే చంద్రబాబు, టీడీపీ, జనసేన లక్ష్యమని జగన్ ఎక్క‌డిక‌క్క‌డ చెబుతున్నారు.

ప్ర‌ధానంగా జ‌గ‌న్ స‌మ‌కాలీన అంశాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా వ‌లంటీర్ల అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తుండ‌డంతో ఇదే అంశాన్ని జ‌గ‌న్ కూడా త‌న ప్ర‌చారంలో ప్ర‌స్తావిస్తున్నారు. అవ్వాతాత లకు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి ఏ ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేస్తుంటే ఈసీకి ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని అన్ని చోట్లా చెబుతున్నారు. అంతేకాదు చంద్ర‌బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పింఛన్లు తొలగిస్తారని చెబుతున్నారు, మొత్తంగా చూస్తూ.. జ‌గ‌న్ ఏరోజు కారోజు.. తాజాగా త‌న‌ప్ర‌సంగాల‌ను దంచి కొడుతున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఇవి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయ‌నేది చూడాలి.