‘వివేకం’ చాలా చాలా డ్యామేజ్ చేస్తోంది

సినిమాలయందు పొలిటికల్ సినిమాలు వేరయా.! ఔను, ఈ సినిమా నిజంగానే వేరే లెవల్.! ఇది పొలిటికల్ సినిమా.! పేరు ‘వివేకం’. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కేసుని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ ఆధారంగా ‘వివేకం’ సినిమాని తెరకెక్కించారు.

దర్శకుడెవరో తెలీదు, నిర్మాత ఎవరో తెలీదు. నటీనటలెవరో తెలీదు.! తెలీదు.. అంటే, అన్ని వివరాలూ తెలుసు.. కాకపోతే, సినిమాలకీ రాజకీయాలకీ పరిచయం వున్నవారెవరికీ వీళ్ళు పెద్దగా తెలియదని అర్థం.

సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. నేరుగా వెబ్ సైట్‌లో, యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. ఆ తర్వాత ట్విట్టర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. వస్తూనే, లక్షలాదిగా వ్యూస్ సంపాదించింది. బహుశా ఇటీవలి కాలంలో ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదేమో.!

వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు.? ఎవరు చంపించారు.? అన్నదే ఈ సినిమా మూల కథ. ఇది కథ కాదు, నిజమే.. అని సాక్షాత్తూ బాధిత కుటుంబానికి చెందిన వైఎస్ సునీతా రెడ్డి తాజాగా సర్టిఫై చేశారు. ఇది ఇంకా ఆసక్తికరం.

మామూలుగా ఈ తరహా సినిమాల్ని సెన్సార్ దగ్గరే అడ్డుకుంటుంది రాజకీయం. కానీ, ‘వివేకం’ సినిమాకి అలాంటి ఇబ్బందులేమీ రాలేదు. ఎందుకంటే, ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయలేదు. ఓటీటీ వైపు కూడా దృష్టి సారించలేదు మేకర్స్.

టార్గెట్ చేసింది వైసీపీనే.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, వైసీపీ కూడా ఏమీ చేయలేకపోయింది. ఎన్నికల వేళ వైసీపీకి ఈ ‘వివేకం’ సినిమా చాలా చాలా డ్యామేజ్ చేస్తోంది రాజకీయంగా. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. రికార్డు స్థాయిలో ఇంకా ఈ సినిమాకి వ్యూస్ దక్కుతూనే వున్నాయ్.