కుప్పం, పిఠాపురంపై కాంగ్రెస్ ముద్ర‌.. బ‌ల‌మైన నేత‌ల‌కే సీట్లు!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 175 స్థానాల‌కు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ(వాస్త‌వానికి మిత్ర‌ప‌క్షాలుగా క‌మ్యూనిస్టుల‌తో చేతులు క‌లిపినా.. దీనిపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ స‌హా క‌మ్యూనిస్టు నాయ‌కులు ఎవ‌రూ కూడా పొత్తుపై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు) 114 స్థానాల‌కు ఒకే సారి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. వీరిలో కురువృద్ధుల నుంచి యువ నాయ‌కుల వ‌ర‌కు అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ ద‌ఫా క‌ళ్యాణ‌దుర్గం స్థానం నుంచి ర‌ఘువీరారెడ్డి పోటీ చేస్తున్నారు.

అదేవిధంగా సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్‌కు.. సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం కేటాయించారు. ఈయ‌న ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడు. పైగా 2004, 2009లో వరుస విజ‌యాలు అందుకున్నారు. వివాద ర‌హితుడు. దీంతో ఇక్క‌డ గెలుస్తారా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఆయ‌న గ‌ట్టి పోటీ అయితే ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, వైసీపీ నుంచి తీసుకున్న ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్ర‌క‌టించింది.

వీరిలో ఇద్ద‌రూ ఎస్సీ నాయ‌కులే కాకుండం గ‌మ‌నార్హం. ఒక‌రు చింత‌ల‌పూడి(ప‌శ్చిమ గోదావ‌రి) నియోజ‌క‌వ ర్గం ఎమ్మెల్యే ఎలీజా. ఈయ‌న‌కు అదే టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. వ్య‌క్తిగ‌తంగా ఎలీజా ప్ర‌భావం నియోజ‌క‌వ‌ర్గం పై స్ప‌ష్టంగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కినా ఆశ్చ‌ర్యంలేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని మ‌రో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరు. ఇక్క‌డ నుంచి ఆర్థ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే.. వైసీపీలో ఏర్ప‌డిన ఆధిప‌త్య పోరు ఆర్థ‌ర్‌కు టికెట్ లేకుండా చేసింది. దీంతో ఆయ‌న కూడా పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ఆయ‌నకు కూడా టికెట్ ప్ర‌క‌టించింది. ఇక‌, ఈయ‌న గెలుపు మాట ఎలా ఉన్నా.. ఓట్ల చీలిక మాత్రం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయ‌తే.. ఇది వైసీపీకి మేలు చేస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు పోటీ చేస్తున్న కుప్పం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ఆవుల గోవిందరాజులు కు టికెట్ ఇచ్చారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన‌ మేడేపల్లి సత్యానందరావు టికెట్ ద‌క్కించుకున్నారు. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ పార్ట అభ్యర్థులు గెలుపుగుర్రం ఎక్కుతారా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఓట్ల చీలిక‌లో మాత్రం ఖ‌చ్చితంగా కీల‌క పాత్ర పోషించ‌డం గ‌మ‌నార్హం.