ఖ‌మ్మం సీటు.. నువ్వా-నేనా.. కాంగ్రెస్‌లో పంచాయ‌తీ!

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఖ‌మ్మం పార్ల‌మెంటు సీటు హాట్ కేక్‌గా మారిపోయింది. లెక్క‌కు మిక్కిలిగా నాయ‌కులు ఇక్క‌డ పోటీకి రెడీ అయ్యారు. వీరిలో అన్న‌ద‌మ్ములు కూడా ఉన్నారు. దీంతో దీనిపై కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఈ సీటులో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు బ‌రిలో ఉన్నారు. అయితే.. ఈయ‌న‌ను ఓడించి.. పార్టీకి ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం క‌ల్పించాల‌నేది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు రెండు నెలల ముందు నుంచి ఖ‌మ్మం సీటుపై కాంగ్రెస్ నాయ‌కులు దృష్టి పెట్టారు. త‌న‌కే ఈసీటు ద‌క్కుతుంద‌ని రేణుకా చౌద‌రి అన్నారు. దీంతో కొంత గ‌డ‌బిడ నెల‌కొంది.

అయితే.. పార్టీ ఆమెకు రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డంతో ఆమె వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, మిగిలిన నాయ‌కుల్లో భ‌ట్టి విక్ర‌మార్క స‌తీమ‌ణి నందిని ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆమె ఏకంగా టికెట్ క‌న్ఫ‌ర్మ్ కూడా కాకుముందే.. ప్ర‌చారం చేప‌ట్టారు. నాకే టికెట్ ఇస్తార‌ని కూడా ప్ర‌క‌టించుకున్నారు. దీనికితోడు మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కూడా ఖమ్మం సీటుపై క‌న్నేశారు. అయితే.. నేరుగా ఆయ‌న కాకుండా.. ఆయ‌న సోద‌రుడిని ఇక్క‌డ నిల‌బెట్టాల‌నేది ఆయ‌న వ్యూహం. నామాకు, పొంగులేటికి ఉన్న వ్యాపార పోటీ దీనికి మ‌రింత ద‌న్నుగా మారింది. పైగా నామాతో స‌రితూగ‌గ‌ల ఆర్థిక శ‌క్తి కూడా త‌న‌కు ఉంద‌ని పొంగులేటి చెబుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి త‌న సోద‌రుడు ప్ర‌సాద్‌రెడ్డిని ఖ‌మ్మం సీటులో కూర్చోబెట్టాల‌ని త‌ప‌న ప‌డుతున్నారు. మ‌రోవైపు.. ఇదే జిల్లాకు చెందిన తుమ్మ‌ల నాగేశ్వ‌రావు కూడా ఈ సీటు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌న త‌న‌యుడు తుమ్మ‌ల యుగంధ‌ర్‌ను ఇక్క‌డ పోటీకి పెట్టాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి స‌హ‌కారం తీసుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. అయితే.. ఈ విష‌యంలో తాను జోక్యం చేసుకోన‌ని రేవంత్ చెప్పిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా కాంగ్రెస్‌లో ముగ్గురు బ‌ల‌మైన నాయ‌కుల కుటుంబాలే ఈ సీటు కోసం పోటీ ప‌డుతున్నాయి.

ఇదిలావుంటే.. ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. కేంద్రం స్థాయిలో కాంగ్రెస్‌నేత‌ల‌తో సంబంధాలు ఉన్న రామ‌స‌హాయం ర‌ఘురాం కూడా ఖ‌మ్మం టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈయ‌న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌కు అత్యంత స‌న్నిహితుడ‌నేపేరుంది. దీంతో ఈయ‌న త‌న‌దైన శైలిలో సీటు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న పేరు రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు పంపించిన జాబితాలో లేక‌పోయినా.. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్ద‌ల వ‌ద్ద ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఎవ‌రికి ఈ సీటు ద‌క్కుతుందో చూడాలి. ఇదిలావుంటే.. హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన మైనారిటీ వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ న్యాయ‌వాది, హైకోర్టు ప్లీడ‌ర్ ష‌హ‌నాజ్‌ను రంగంలోకి దింప‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఖ‌మ్మం సీటు మాత్రం కాంగ్రెస్‌లో గ‌డ‌బిడ‌గానే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎవరికి ఇచ్చినా.. మ‌రొక‌రి అల‌క త‌థ్య‌మ‌ని అంటున్నారు.