రేవంత్ స్థానంపై బీఆర్ఎస్ క‌న్ను!!

తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టి ఇప్పుడు మల్కాజిగిరి స్థానంపైనే ఉంది. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. పైగా ప్ర‌స్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్తానం. దీంతో అంద‌రి దృష్టి ఈ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉంది. ఈ స్తానాన్ని ద‌క్కించుకునేందుకు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో అంతే తీవ్రంగా బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ కూడా.. త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ ఈ సీటుపై ఫోకస్ పెట్టాయి.

సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో మ‌ల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. సిట్టింగ్ సీటు కూడా కావడంతో మల్కాజిగిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకే నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టారు. దీంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది.

బ‌ల‌మైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్‌లో ఉన్న వికారాబాద్ జెడ్పీ చైర్ ప‌ర్సన్ సునీతా మ‌హేంద‌ర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

తన నియోజ‌క‌వ‌ర్గం కావడంతో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. మూడెంచ‌ల విధానంతో గెలుపుబావుట ఎగుర‌వేయాల‌ని భావిస్తున్నారు. సీనియ‌ర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియ‌మించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని మల్కాజిగిరిలో బరిలో దింపారు.

ప్రధాన ప్రతిప‌క్షం బీఆర్‌ఎస్ ఈ సారి మ‌ల్కాజిగిరిలో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఒక్కసారి కూడా నెగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో ఈసారి విజయంపై కొండంత ఆశగా ఉన్నారు. ఎమ్మెల్యే లంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉండ‌టంతో గెలిచి తీరాల‌ని పట్టుదలతో ఉంది.

రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హించిన స్థానం కావ‌డంతో గెలిచి కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాల‌ని బీఆర్ఎస్ ప్లాన్ చూస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల తరహాలోనే ఓట‌ర్లు ఈసారి బీఆర్‌ఎస్‌నే ఆద‌రించి, తొలిసారి మల్కాజిగిరిలో గులాబీ పార్టీకి విజయం అందిస్తారని ధీమాగా ఉన్నారు.

మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం వ్యూహాలు రచిస్తోంది. మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీల‌క పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ప్రధాని న‌రేంద్ర మోడీ మల్కాజి గిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోడీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు.