మ‌చిలీప‌ట్నంపై ఎవ‌రి స‌త్తా ఎంత‌? జోరుగా పందేలు!

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఎవ‌రి జెండా ఎగురుతుంది? ఇక్క‌డ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం ద‌క్కించుకుంటారు? అనేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. ఇక్క‌డ గెలుపుల‌పై అప్పుడే పందేలు కూడా క‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌చిలీపట్నం స్థానం నుంచి మాజీ మంత్రి కాపు నాయ‌కుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తి(కిట్టు) పోటీ చేస్తున్నారు. బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి అభ్య‌ర్థిగా టీడీపీ నేత‌, మాజీ మంత్రి, బీసీ నాయ‌కుడు కొల్లు ర‌వీంద్ర పోటీకి రెడీ అయ్యారు.

1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం భ్యర్థి బొర్రా వెంకటస్వామి కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి వడ్డీ రంగారావు బరిలో దిగగా…కాంగ్రెస్ పార్టీ తిరుమణి మంగతాయారును పోటీలో నిలిపింది. ఆ ఎన్నికల్లోనూ వడ్డీ రంగారావు విజయం సాధించారు. వరుస పోరాటాల అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇలా టీడీపీ ఇక్కడ తొలినాళ్ల‌లోనే బ‌ల ప‌డింది.

1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి మరోసారి నదికుదిటి నరసింహారావు టి జయకేతనం ఎగురవేశారు. 2009లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్నినాని మరోసారి పోటీ చేయగా.. తెలుగుదేశం మాజీమంత్రి నదికుదిటి నరసింహారావు మేనల్లుడు కొల్లు రవీంద్ర కు టిక్కెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లోనూ పేర్నినాని రెండోసారి విజయం సాధించారు.

రాష్ట్రవిభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో పేర్నినాని వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా… తెలుగుదేశం నుంచి కొల్లురవీంద్ర మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాంత్రిగానూ పనిచేశారు. గత ఎన్నికల్లో మరోసారి ఇదే ప్రత్యర్థులు పోటీపడగా… మరోసారి పేర్నినానిని విజయం వరించింది. ఈసారి ఆయన జగన్ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు.

ప్ర‌స్తుత ఎన్నికల్లో పేర్ని కుటుంబం నుంచి మూడోతరం వారసుడు పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి వైసీపీ తరపున బరిలో దిగుతుండగా… తెలుగుదేశం మరోసారి కొల్లు రవీంద్రకు సీటు కేటాయించింది. గ‌త ఐదేళ్ల‌లో కొల్లు ఇక్క‌డ పార్టీ కోసం ప‌నిచేసి ఉండ‌డం, ఆయ‌న‌పై కేసులు పెట్టి జైలుకు పంపించండం నేప‌థ్యంలో సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. దీంతో ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌నే స్థానికంగా నాయ‌కులు చెబుతున్న మాట‌.