అనుమానం లేదు.. గేమ్ ఈజ్ ఓవ‌ర్‌: చంద్ర‌బాబు

“అనుమానం లేదు.. వైసీపీ గేమ్ ఈజ్ ఓవ‌ర్‌.” అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వ‌హించిన ‘ప్రజాగళం’ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆసాంతం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

“ప్రజల్లో ఇంత కసి ఎప్పుడూ చూడలేదు. గేమ్ ఈజ్ ఓవర్… కూటమి అన్ స్టాపబుల్. ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ (టీడీపీ) తొక్కుకుంటూ పోతుంది… గ్లాసు (జనసేన) కూడా ఎక్కడిక్కడ కుమ్మేసుకుంటూ పోతుంది… పువ్వు (బీజేపీ) కూడా కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది” అని మూడు పార్టీల కూటమి గురించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసు కున్నట్టు అని చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా… రాష్ట్రంలో కరవు కనిపించడం లేదా? తాగడానికి నీళ్లు ఉన్నాయా? ఇక్క డ జగన్ కు బిందెలతో నిరసన తెలిపారు. అవునా, కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. “అన్ని ఊళ్లకు నీళ్లిచ్చాను, నా ముద్ర ఉంది అని చెప్పుకుంటున్నాడు… ఏంటి నీ ముద్ర, ఎక్కడుంది నీ ముద్ర? తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు ముద్ర గురించి మాట్లాడతావా? ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టి వేయని నువ్వు ముద్ర గురించి మాట్లాడతావా?” అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

“రాయలసీమలో 102 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు. నేను గతంలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే, ఇతడు ముష్టి రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర తప్ప వేరే నీళ్లు రావు. అలాంటి ప్రాజెక్టులను నేను ముందుకు తీసుకెళితే, ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాక ఒక్క పని కూడా చేయలేదు. ఈ ప్రాంతం నుంచి కూలీ పనుల కోసం బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, గోదావరి జిల్లాలకు వెళ్లే పరిస్థితి ఉంది. నేను మీకు అండగా ఉంటా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా… ఈ కర్నూలు జిల్లా దశ దిశ మార్చి మీ భవిష్యత్తును మార్చుతా“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ద్రోహి!

“ఎమ్మిగనూరు గడ్డపై నుంచి చెబుతున్నా… జగన్ రాయసీమ ద్రోహి… ఒక్క ఓటు కూడా వేయొద్దు. ఈ ప్రాంతంలో అనేక వెనుకబడిన కులాల వారికి అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చాం. టీడీపీ డీఎన్ఏలోనే బీసీ ఉంది. బీసీలను గుండెల్లో పెట్టుకునే పార్టీ టీడీపీ. మా అబ్య‌ర్థుల‌ను గెలిపించండి” అని చంద్ర‌బాబు అన్నారు.