పిఠాపురంలోనే ఇల్లు: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి కొబ్బ‌రికాయ కొట్టారు. ఇక్క‌డ నుంచే ఆయ‌న త‌న ప్ర‌చారాన్ని ప్రారంభించారు. వారాహి వాహ‌నానికి అధికారులు అనుమ‌తి లేద‌ని చెప్పారు. దీంతో ప‌వ‌న్‌.. వేరే వాహ‌నంపై ప్ర‌చారం చేశారు. కొద్దిదూరం ప‌ర్య‌టించి.. స్థానికుల‌తో మ‌మేక‌మ‌య్యారు. అంనంత‌రం ఆయ‌న ప్ర‌సంగిస్తూ.. పిఠాపురంలోనే తాను ఇల్లు కట్టుకుంటాన‌ని చెప్పారు. అంతేకాదు.. త‌న‌ను ఈ ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని.. అలా చేస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. “పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. న‌న్ను గెలిపించండి. నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటా. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆసుపత్రులన్నీ బాగు చేయిస్తా. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తా. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తా. మోడల్‌ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతా. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వచ్చాడు. మండలానికి ఓ నాయకుడిని పెట్టారు. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయినా.. మీపై నాకు విశ్వాసం ఉంది. న‌న్ను గెలిపిస్తార‌ని ఆశిస్తున్నా” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

పొత్తు అందుకే పెట్టుకున్నాం.

అనేక సార్లు నేను రైతుల‌ను క‌లిశా. సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను క‌లిశా.. అని ప‌వ‌న్ అన్నారు. ఈ ఐదేళ్ల‌లో ప్ర‌జ‌లు న‌లిగిపోయారు. అన్ని వ‌ర్గాలు విల‌పిస్తున్నాయి. అందుకే ఈ దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని పవన్‌కల్యాణ్ చెప్పారు. తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి స‌త్య‌నారాయ‌ణ వర్మకు ప‌వ‌న్ ధన్యవాదాలు తెలిపారు.

అంతా దోచేశారు!

కాకినాడ సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగలేదని ప‌వ‌న్ అన్నారు. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైసీపీ నేతలు ఏం చేశారని నిల‌దీశారు. కాకినాడ పోర్టు.. డ్రగ్స్‌, బియ్యం, డీజిల్‌ మాఫియాకు అడ్డాగా మారింది. ఎన్నికల ఖర్చుకు కావాల్సిన డబ్బును ఆ పోర్టులోనే దాచారు. యువతకు రూ.5 వేల జీతం కావాలా? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా? అనేది తేల్చుకోవాలి. సీఎం జగన్ వ‌చ్చి క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతాడు. ఆయ‌న మాయమాటలకు మోసపోకండి. జగన్ ప‌క్కా అవినీతిపరుడు. ఈ విష‌యం నేను ఆది నుంచి చెబుతున్నా. గద్దె దించాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఆలోచించాలి” అని పవన్ పిలుపునిచ్చారు. కాగా ఆదివారం కూడా పిఠాపురంలోనే ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు.