‘ఏపీని ఎంత నాశ‌నం చేయాలో అంతా చేశాడు’

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో అవినీతి పెరిగిపోయింద‌ని.. అందుకే తాను ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాన‌ని ఆయ‌న చెప్పారు. అవినీతి ప్ర‌భుత్వాన్ని అంతం చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని.. ప‌రోక్షంగా వైసీపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ను రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్ణయించిందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజంపేట పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి ఉమ్మ‌డిగా క‌ష్ట‌ప‌డ‌తామ‌ని చెప్పారు.

“రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఐదేళ్లలో ఏం జరిగిందో నా కంటే మీకే బాగా తెలుసు. 2014 తర్వాత మళ్లీ నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం అవినీతిని మట్టి కరిపించడానికి. ఏపీలో అవినీతి పెరిగిపోయింది. నేను త‌ర‌చుగా ఇక్క‌డ‌కు(చిత్తూరు జిల్లా) వ‌స్తుంటాను. అనేక మంది నాయ‌కులు నాకు చెప్పారు. అవినీతి పెరిగిపోయింద‌ని.. పేద‌ల‌కు రూ.10 ఇచ్చి వారి నుంచి రూ.100 దోచుకుంటున్నార‌ని చెప్పారు. నేను కూడా ప్ర‌త్య‌క్షంగా చూశా. అందుకే రాజ‌కీయంగా మ‌రోసారి పుంజుకుని అవినీతి ప్ర‌భుత్వాన్ని అంతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా” అని కిర‌ణ్ వ్యాఖ్యానించారు.

“గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ప్రతి నెల ఆర్బీఐ, కేంద్రం నుంచి అప్పు తీసుకోకపోతే రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని గ‌త ఐదేళ్ల‌లో ఆయ‌న‌(ప‌రోక్షంగా జ‌గ‌న్‌) ఎంత నాశ‌నం చేయాలో అంతా చేశాడు. దీనిని అభివృద్ధిలో న‌డిపించాల‌న్న ప్ర‌ధాన ఉద్దేశంతోనే మేము(టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ) కలిశాం. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గల ప్రజలు మాకు పూర్తి మద్దతు ఇవ్వాలి” అని కిర‌ణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

మోడీపై ప్ర‌శంస‌లు

కాగా, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌సంశ‌లు గుప్పించారు. “మోడీ 10 సంవత్సరాలు ప్రధానిగా, 12 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా మచ్చలేని నేతగా ప‌నిచేశారు. ప్రజల కోసం ఈ రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి. ఐదు ఇస్లామిక్ దేశాలలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న వ్యక్తి మోడీ. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని మోడీ ముందే చెప్పార”ని అన్నారు.