కూట‌మి పార్టీలు త‌ప్పు చేశాయి: ర‌ఘురామ

టికెట్ ఇవ్వ‌లేదు. ఇస్తార‌నే సంకేతాలు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయినా కూడా.. న‌ర‌సాపురం రెబల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ రాజు మాత్రం న‌మ్మ‌కం పోగొట్టుకోవ‌డం లేదు. తాజాగా కూడా మ‌రోసారి ర‌ఘురామ త‌న‌కు టికెట్ ఇస్తార‌ని, వ‌స్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాజాగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. కూట‌మి పార్టీలు త‌ప్పులు చేశాయ‌ని చెప్పారు.

“కూట‌మిగా ఏర్ప‌డిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీలు.. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశాయి. అయితే.. వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లను కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి తరపున నాకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదు. ఢిల్లీలోని బీజేపీ నేతలతో నాకున్న సాన్నిహిత్యం జిల్లాలోని బీజేపీ నేతలతో లేదు. అందుకే నా గురించి ఢిల్లీకి వ్యతిరేక సంకేతాలు వెళ్లి ఉండవచ్చు” అని అన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశించి భంగ‌ప‌డిన వారి గురించి మాట్లాడుతూ.. పొత్తుల కార‌ణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ని.. ఈ విష‌యం వారికి కూడా తెలుస‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. అయితే.. భావోద్వేగంతోనే కొంద‌రు నాయ‌కులు ఇలా చేస్తు్న్నార‌ని అంటున్నారు. ఇక‌, కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సి ఉందని చెప్పారు.

నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు మంచి మిత్రుడని రఘురాజు చెప్పారు. గత 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. ఢిల్లీ పెద్దలు ఇంకా ఆరా తీస్తున్నారని, సర్వేలు చేయిస్తున్నారని, ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ర‌ఘురామ ఆశాభావం వ్య‌క్తం చేశారు.