ప‌వ‌న్‌పై క‌సి తీర్చేసుకున్న ముద్ర‌గ‌డ‌.. ఏ రేంజ‌లో అంటే!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పీక‌ల లోతు ఆవేద‌న‌, ఆక్రంద‌న వ్య‌క్తం చేస్తున్న కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ఎంపీ ముద్ర గ‌డ ప‌ద్మ‌నాభం.. ఆ క‌సినంతా తీర్చేసుకున్నారు. అది కూడా ఓ రేంజ్‌లో ఆయ‌న రెచ్చిపోయారు. జ‌న‌సేన అధినేత‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నిజానికి వైసీపీలోకి చేరిన త‌ర్వాతే ఆయ‌న ప‌వ‌న్‌పై తొలిసారి “నువ్వు సినిమాల్లో హీరో మాత్ర‌మే. మేం రాజకీయంగా హీరోలం” అంటూ..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. తాము పార్టీని ముందుండి న‌డిపిస్తామ‌న్నా.. పోయి పోయి పొత్తులు పెట్టుకున్నాడ‌ని నిప్పులు చెరిగారు. పొత్తులుపెట్టుకుని కూడా క‌నీసం త‌న వారికి సీట్లు ద‌క్కించుకోలేక పోయార‌ని విమ‌ర్శించారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రింత దూకుడు వ్యాఖ్య‌లు చేశారు ముద్ర‌గ‌డ‌. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్  పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సీటును చాలా స‌మీక‌ర‌ణ‌లు, చాలా స‌ర్వేల అనంత‌రం.. ఆయ‌న ఏరికోరి ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. తాజాగా ముద్ర‌గ‌డ ప‌వ‌న్‌పై నిప్పులు చెరుగుతూ.. పిఠాపురంలో ప‌వ‌న్ ఓడిపోవడం ఖాయమని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. “ఎన్నికలంటే సినిమాలు కాదు. ఆవేశంగా నాలుగు డైలాగులు చెప్పేసి.. ఊగిపోతూ ప్రసంగాలు చేసినంత మాత్రాన ఓట్లు పడవు” అని త‌న‌దైన శైలిలో ప‌వ‌న్‌ను విమ‌ర్శించారు.

అంతేకాదు.. ముద్రగ‌డ చిరుకు, ప‌వ‌న్‌కు పోలిక పెట్టారు. రాజకీయాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కంటే చిరంజీవే బెటర్ పవన్ జైలుకెళ్లి చంద్రబాబును కలిసిన తర్వాతే ఆయన గ్రాఫ్ పెరిగిందని తాను చెప్పా.. దీంతో చంద్రబాబు నాపై కోపం పెంచుకున్నారు.. అని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని, అందుకే రెండు మూడు సార్లు ప‌వ‌న్ వ‌స్తాన‌ని చెప్పి కూడా చంద్ర‌బాబు అనుమ‌తి లేక‌పోవ‌డంతో రాలేద‌ని, దీంతో తాను నిజంగానే బాధ‌ప‌డ్డాన‌ని ముద్ర‌గ‌డ‌ చెప్పారు.

బీజేపీలో చేరాల‌నుకున్నా!

గ‌తంలో తాను బీజేపీలో చేరాల‌ని అనుకున్న‌ట్టు ముద్ర‌గ‌డ చెప్పారు. “ఔను బీజేపీలో చేరాల‌ని అనుకున్నా. పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ర‌ద్దు, ఏపీకి ప్రత్యేకహోదా తదితర అంశాలపై హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌ని చెప్పా. కానీ, నా ప్ర‌తిపాద‌న‌లు చూసి  వారి నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వైసీపీలో చేరా” అని ముద్ర‌గ‌డ వివ‌రించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా.. బలమైన అభ్యర్థులకే జగన్ టికెట్లు ఇచ్చారని ముద్ర‌గ‌డ‌ తెలిపారు. మరో 30 ఏళ్లు జగనే అధికారంలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.