రేవంత్ స‌న్నిహితుడికి సీటిచ్చిన కాంగ్రెస్‌.. ఎక్క‌డ నుంచి?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స‌న్నిహితుడిగా గుర్తింపు పొందిన చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ల‌భించింది. తాజాగా ఆయ‌న‌కు భువ‌న‌గిరి పార్ల‌మెంటు స్థానాన్ని ఇచ్చింది. దీంతో సీఎం చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే మరో నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిజామాబాద్ టికెట్ ఇచ్చారు.

ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానాన్ని ఆత్రం సుగుణకు కేటాయించారు. ఇక్క‌డ ఉంచి బీఆర్ ఎస్ త‌ర‌పున ఆత్రం స‌క్కు పోటీ చేస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్యే పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంది. ఇక‌, కీల‌క‌మైన‌ మెదక్ స్థానాన్ని నీలం మధుకు కేటాయించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలను పెండింగులో ఉంచారు.  

మొత్తంగా దేశంలోని 14 స్థానాలతో 8వ జాబితాను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. దీనిలో తెలంగాణ‌లోని నాలుగు స్థానాలతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్‌ స్థానాలు కూడా ఉన్నాయి. కాగా, భువనగిరి నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనను కోరినా అంగీకరించలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తెలిపారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన చూసి కేటీఆర్ వణుకుతున్నారని పేర్కొన్నారు.

అయితే.. బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వారి బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేసుకు న్న కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మ‌కంగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం గ‌మ‌నార్హం.  వీరిలో ముగ్గు రు కోటీశ్వ‌రులు కావ‌డం గ‌మ‌నార్హం. ఎస్టీ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతున్న సుగుణ కీల‌కంగా మార‌నుంది. ఇక్క‌డ ట‌ఫ్ ఫైట్ న‌డ‌వ‌నుంద‌ని తెలుస్తోంది.