విశాఖలో భారీ టైర్ల ప్లాంట్… రూ. 1240 కోట్ల పెట్టుబడి

ఏపికి శుభవార్తనే చెప్పాలి. విశాఖపట్నంలో అచ్యుతాపురం పారిశ్రామికవాడలో జపాన్ పారిశ్రామిక దిగ్గజం యోకోహామా ఓ టైర్ల ప్లాంటును ఏర్పాటు చేయటానికి రెడీ అయిపోయింది. యోకోహామా లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూపు ప్లాంటు ఏర్పాటును దగ్గరుండి మరీ పర్యవేక్షించబోతోంది. సుమారు రూ. 1240 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటు రెడీ చేయబోతున్నట్లు యోకోహామా ఇండియా ఛైర్మన్ నితిన్ మంత్రి స్వయంగా చెప్పారు. దాంతో టైర్ల ప్లాంటు ఏర్పాటు ఖాయమనే అనిపిస్తోంది.

వైజాగ్ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయబోతున్న ప్లాంటులో కొత్తగా 600 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు కూడా మంత్రి చెప్పారు. మనదేశంలోని గుజరాత్, తమిళనాడులో ఇఫ్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తున్నాయి. తమిళనాడు ప్లాంటుకు అనుబంధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం కూడా ప్రత్యేకంగా ఉంది. అంటే వైజాగ్ లో ఏర్పాటు చేయబోయే ప్లాంటు మూడోదన్నమాట. ఇప్పటకే సుమారు ఈ కంపెనీ 5 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది.

మూడో ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని అన్వేషించటంలో భాగంగా వైజాగ్ ను గుర్తించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా వైరస్ కారణంగా దాదాపు ఐదుమాసాలు ఆలస్యమైందని కూడా చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే ప్లాంటు 2023కి ఉత్పత్తికి రెడీ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుజరాత్, తమిళనాడులో ఉన్న ప్లాంట్ల ఏడాది ఉత్పత్తి సామర్ధ్యం 2.3 లక్షల టన్నులుంటుందని చెప్పారు. వైజాగ్ ప్లాంటు ఉత్పత్తి సామర్ధ్యం 20 వేల టన్నులుంటుందని అంచనా వేశారు.

తమ ప్లాంటులో తయారయ్యే టైర్లు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో వాడేవి, పారిశ్రామిక రంగంలో ఉపయోగించేవి, అటవీ ప్రాంతాల్లో ఉపయోగించే పద్దతుల్లో తయారవుతాయని చెప్పారు. ప్రస్తుత ప్లాంట్లలో తయారయ్యే టైర్లు 120 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు చెప్పారు.