హ‌రీష్‌రావు పీఏ అరెస్టు.. బీఆర్ ఎస్‌కు మ‌రో ఉచ్చు!

కీల‌కమైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు క‌విత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వివాదం విచార‌ణ ముమ్మ‌రం కావ‌డం, పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు జంప్ అయిపోతుండ‌డం.. వంటి ఘ‌ట‌న‌ల‌తో ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ ఎస్‌కు మ‌రో షాక్ త‌గిలింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌ రావు పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ను జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో సీఎంఆర్ ఎఫ్‌(ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కుల దుర్విని యోగం జ‌రిగింద‌నే కేసు కొన్నాళ్ల కింద‌టే న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో హరీష్‌ రావు పీఏ నరేశ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వి నియోగం అయ్యాయని, అనర్హులకు చెక్కులు అందించారని మెదక్ జిల్లా నారాయణఖేడ్ కు చెందిన రవి నాయక్ ఫిర్యాదు చేశారు.

ఇదీ ఫిర్యాదు..

తనకు మంజూరైన రూ.5 లక్షల చెక్కును.. హ‌రీష్ రావు పీఏ నరేశ్ కుమార్ కాజేశాడని ర‌వినాయ‌క్‌ ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ తర్వాత నరేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి హరీష్ రావు ఆఫీసులో నరేశ్ కుమార్, మరో ముగ్గురు ఆఫీసు సిబ్బంది సీఆర్ఎంఎఫ్ విభాగంలో పనిచేశారు.

ఈ క్రమంలోనే చెక్కుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచా రం. రవినాయక్ కు చెందిన రూ.5 లక్షల చెక్కును క్యాష్ చేసుకుని నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్ లు పంచుకున్నారని తెలిసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో వారి దగ్గర మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సొమ్మును కూడా పంచుకునే ప్లాన్‌లో ఉన్నార‌ని స‌మాచారం. అయితే.. ఈ విష‌యంలో బీఆర్ ఎస్ నేత‌ల పాత్ర ఉంద‌నేది కాంగ్రెస్ నేత‌ల విమ‌ర్శ‌. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.