తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు ఎన్ని వసతులంటే?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెకు కోర్టు తిహార్ జైల్ కు రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద జైలుగా చెప్పే తిహార్ జైల్లో కవిత ఉన్నన్ని రోజులు ఎలాంటి వసతులు కల్పించాలన్న అంశంపై కోర్టు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. ఉండేది తీహార్ జైల్లో అయినప్పటికీ ఆమె ఇంటి భోజనం చేయొచ్చని.. జైల్లో ఉన్నప్పటికీ ఆభరణాలు ధరించేందుకు వీలుగా ఆమెకు న్యాయమూర్తి సదుపాయాన్ని కల్పిస్తూ ఆదేశాలుజారీ చేశారు.

పద్నాలుగు రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కవిత కోరినట్లుగా ఆమెకు కొన్ని వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. ఇందులో భాగంగా ఆమెకు ఇంటి భోజనం, మంచం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్, దుప్పటి, పుస్తకాలు, పెన్నులు, రాసుకోవటానికి కాగితాలు, ఆభరణాలు, మందులుతీసుకెళ్లేందుకు వీలుగా అనుమతి కోరారు.

కవిత కోరిన వసతుల్ని కల్పించేందుకు వీలుగా ఆమెకు అనుమతులు ఇస్తున్నట్లుగా న్యాయమూర్తి కావేరీబవేజా పేర్కొన్నారు. ఇంటి భోజనం చేయటానికి.. జైల్లో ఆభరణాలు ధరించటానికి ఆమెకు కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో ఉన్న వేళ.. కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డుల్ని ఆమె తరఫు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే తీహార్ జైలుకు తరలించటానికి ముందు ఒక పరిణామం చోటు చేసుకుంది. మధ్యాహ్నం రెండు గంటల వేళలో కోర్టు కవితకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ పేర్కొనగా.. కాసేపటికే కవితను రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక సెల్ లోకి తీసుకెళ్లి.. అక్కడే కాసేపు ఉంచేశారు. దాదాపు మూడు గంటల పాటు ఆ సెల్ లో ఆమె ఉన్నారు. ఆ టైంలో ఆమెను కలిసేందుకు కుటుంబ సభ్యులు రాగా.. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని ఆ సెల్ నుంచి దూరంగా పంపేశారు.

సాయంత్రం 5 గంటల వేళలో సెల్ లోకే వాహనాన్ని నేరుగా తీసుకెళ్లి.. అందులో ఎక్కించుకొని తిహార్ జైలుకు తరలించారు. సాయంత్రం ఆరు గంటల వేళకు ఆమె తిహార్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ప్రత్యేక గదిని కేటాయించారు. వసతులన్ని ఓకే.. ఆభరణాల్ని ధరించేందుకు అనుమతి ఏమిటన్న సందేహానికి కొందరు న్యాయవాదులు వివరిస్తూ.. నేరం నిరూపితం కాకపోవటం.. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు తాళిబొట్టు.. నల్లపూసలు.. గాజులు లాంటి ఆభరణాల్ని ధరించేందుకు అనుమతి ఇచ్చే వీలుందని చెబుతున్నారు.