బీజేపీ.. కార్పొరేట్ పార్టీ కాద‌ని ఎలా చెప్ప‌గ‌ల‌రు?

కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న బీజేపీ సామాన్యుల పార్టీ అని.. పేద‌ల పార్టీఅని క‌మ‌ల‌నాథులు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు దంచి కొడుతుంటారు. కానీ, పొట్ట విప్పి చూస్తే.. బీజేపీ అస‌లు స్వ‌రూపం బ‌య‌ట ప‌డుతుంది. బీజేపీ ఫ‌క్తు కార్పొరేట్ పార్టీ అనేది ఇప్పుడు నిజ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా కార్పొరేట్ దిగ్గ‌జం న‌వీన్ జిందాల్‌కు బీజేపీ తీర్థం ఇచ్చింది. కండువా క‌ప్పి.. పార్టీలోకి ఆహ్వానించింది. ఇప్ప‌టికే పార్టీకి దూరంగా ఉన్న‌.. అంబానీ, అదానీలు బీజేపీకి అనుకూల‌మ‌నే విష‌యం తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ప్రధాని మోడీ చేప‌ట్టిన‌ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు బీజేపీలో చేరినట్టు నవీన్ జిందాల్ తెలిపారు. 2004-14 మధ్య కురుక్షేత్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రస్తుతం బీజేపీ తరుపున మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

పార్టీలో చేరిక సందర్భంగా నవీన్ జిందాల్ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. గత పదేళ్ల కాలంలో మోడీ సారథ్యంలో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఓ భారీ ముందడుగని ప్రశంసించారు. రామ మందిర నిర్మాణం గురించి కూడా ప్రస్తావించారు. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీకి జిందాల్ చేరికతో కొత్త ఊపు వచ్చిందని పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే తెలిపారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌తో బీజేపీ కార్పొరేట్ల‌కు ఎలా చేరువైంద‌నేది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది.