కేసుల ఎఫెక్ట్‌.. పార్టీని విలీనం చేసిన జ‌నార్ద‌న్‌రెడ్డి

అన్ని పార్టీలూ పొమ్మ‌న్నాయి. ఏ పార్టీ కూడా క‌నీసం నీడ‌నిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో సొంత‌గా పార్టీ పెట్టుకుని.. దానిని డెవ‌ల‌ప్ చేసిన గ‌నుల వ్యాపారి, క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి.. తాజాగా పాత గూటికే చేరారు. బీజేపీ నుంచి వ‌చ్చి.. మ‌ళ్లీ బీజేపీలోనే త‌న సొంత పార్టీని ఆయ‌న విలీనం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో ఇదొక కీలక పరిణామమనే చెప్పాలి. మొత్తం 28 పార్లమెంటు స్థానాలున్న ఈ రాష్ట్రంలో మ‌రోసారి బీజేపీ త‌న హ‌వా నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

గత ఎన్నిక‌ల్లో 28 సీట్ల‌కు 25 చోట్ల బీజేపీ ఒంట‌రిగా విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిన ద‌రిమిలా.. ఇత‌ర పార్టీల‌ను కూడా క‌లుపుకొని ముందుకు పోతోంది. ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాలో బ‌లమైన ప‌ట్టున్న గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిని కూడా కేసుల బూచి చూపి.. త‌న‌వైపు వ‌శ‌ప‌రుచుకున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ సాగుతోంది. తన పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష'(కేఆర్పీపీ)ని ఆయ‌న బీజేపీలో విలీనం చేశారంటే ఏం రేంజ్‌లో తెర‌వెనుక రాజ‌కీయం న‌డిచి ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిందే.

మాజీ ముఖ్యమత్రి య‌డియూరప్ప సమక్షంలో తన పార్టీని గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి బీజేపీలో కలిపేశారు. ఆయన‌తో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకొన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోడీని మూడో సారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు.

క‌ట్ చేస్తే.. ఏడాది కింద‌ట‌.. అంటే.. గ‌త ఏడాది మేలో క‌ర్ణాట‌క ఎన్నిక‌లు జ‌రినప్పుడు ఇదే గాలి జ‌నార్ద న్‌రెడ్డి.. అదే మోడీకి వ్య‌తిరేకంగా.. బీజేపీకి వ్య‌తిరేకంగా సొంత పార్టీ పెట్టుకున్నారు. త‌న‌ను రాజ‌కీయంగా తొక్కేస్తున్నార‌ని.. అందుకే విధిలేని ప‌రిస్థితిలో తాను సొంత పార్టీ పెట్టుకున్నాన‌ని ఆయ‌న చెప్పారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌నే త‌న పార్టీని బీజేపీలో విలీనం చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, గాలి జ‌నార్ద‌న్ రెడ్డిపై 18కి పైగా సీబీఐ, 12కుపైగా ఈడీ కేసులు ఉన్నాయి. ఆయ‌న‌ప ఇప్ప‌టికీ.. హైకోర్టు ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.