టార్గెట్ లోకేష్‌.. ఈ సోదాల ప‌ర‌మార్థ‌మేంటి?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ టార్గెట్ అయ్యారా? ఆయ‌న‌ను ఏదో ఒక విదంగా కేసుల్లో ఇరికించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయా? అంటే..టీడీపీ నాయ‌కులు ఔన‌నే అంటున్నారు. ఆయ‌న కాన్వాయ్‌ను వ‌రుస పెట్టి సోదాలు చేస్తుండ‌డం.. ఒకే రోజు రెండు సార్లు సోదాలు చేయ‌డం వంటివి టీడీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రాన్ని పెంచుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ ర్గం నుంచి వ‌రుస‌గా రెండో సారి పోటీ చేస్తున్న నారా లోకేష్‌..కొన్ని రోజుల కింద‌ట ఇక్క‌డ ప్ర‌చారం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఉద‌యాన్నే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఉండ‌వ‌ల్లి నుంచి మంగ‌ళ‌గిరి స్థానిక బైపాస్ ఎక్క‌గానే పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు.

అదేమంటే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో తాము సోదాలు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇది ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, ఆయ‌న‌ను వ‌రుస పెట్టి త‌నిఖీలు చేస్తుండ‌డమే ఇప్పుడు అనుమానాలు వ‌చ్చేలా చేస్తోంది. తాజాగా ఆదివారం ఆయ‌న కాన్వా య్‌ను వ‌రుస‌గా రెండుసార్లు త‌నిఖీలు చేశారు. ఇది కూడా కోడ్ నేప‌థ్యంలో చేస్తున్న త‌నిఖీలుగానే అధికారులు చెప్పారు. అయితే.. ఇలా వ‌రుస‌గా త‌నిఖీలు చేయ‌డం వెనుక వ్యూహం ఉంద‌నేది టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు లోకేష్ కాన్వాయ్‌ను త‌నిఖీ చేసిన అధికారుల‌కు స‌ద‌రు కార్ల‌లో ఎలాంటి నిషేధిత‌.. లేదా ప్ర‌జ‌ల‌ను, ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే ప‌దార్థాలు, వ‌స్తువులు, న‌గ‌దు క‌నిపించ‌లేదు. ఈ విష‌యాన్ని పోలీసులే చెప్పారు.

అయినా కూడా ఆదివారం ఒక్క రోజే రెండుసార్లు లోకేష్ కాన్వాయ్‌ని ఆపి చెక్ చేశారు. అది కూడా టీడీపీ నేతల కార్లను మాత్ర మే తనిఖీలు చేయడం పట్ల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేష్ కాన్వాయ్‌ని పోలీసులు ఆపారు. ఆయన కాన్వాయ్‌లోని ప్రతి కారును చెక్ చేశారు. ఒక్కరోజే రెండుసార్లు చెక్ చేయ‌డంతో టీడీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నామని లోకేష్‌కి చెప్పారు. కాగా, వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదని పోలీసులను టీడీపీ నేత‌లు ప్రశ్నిస్తున్నారు. ఒక్క టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అని నిల‌దీస్తున్నారు.