తెలంగాణ బీజేపీ నేత‌కు చంద్ర‌బాబు టికెట్!

బీజేపీతో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు త్యాగాల‌కు సిద్ధ‌మ‌య్యారా? బీజేపీ నేత‌ల‌కు ఏపీలోనూ టికెట్లు ఇస్తున్నారా? అంటే. తాజాగా జ‌రిగిన ప‌రిణామం ఔన‌నే అంటోంది. టీడీపీ శుక్ర‌వారం ప్రకటించిన ఎంపీల జాబితాలో బాపట్ల(ఎస్సీ) అభ్యర్థిగా తెన్నేటి కృష్ణ ప్రసాద్ ను చంద్ర‌బాబు ఎంపిక చేశారు. వాస్త‌వానికి బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి(వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీకి జై కొట్టారు) పేరు ఎక్కువగా వినిపించింది. అయితే.. ఆమె ఓడిపోతుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో టీడీపీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎంఎస్ రాజు పేరు కూడా బాప‌ట్లలో మార్మోగింది.

కానీ, చంద్ర‌బాబు అనూహ్యంగా బాప‌ట్ల ఎస్సీ స్థానానికి బీజేపీ వరంగల్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన కృష్ణప్రసాద్ పేరును ఖ‌రారు చేశారు. పోలీస్ అధికారిగా రిటైర్ అయిన తర్వాత కృష్ణ ప్ర‌సాద్‌ బీజేపీలో చేరారు. బీజేపీ తరపున వరంగల్ టిక్కెట్ ఆశించారు. కొంత కాలంగా వరంగల్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెన్నేటి కృష్ణప్రసాద్ అక్క‌డ పోటీ చేయాల‌ని భావించారు. కానీ, వరంగల్ బీజేపీ టిక్కెట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు కేటాయించనున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో కృష్ణప్రసాద్ కు ఎక్కడా అవకాశం లేక‌పోవ‌డంతో బీజేపీ సూచ‌న‌ల మేర‌కు చంద్ర‌బాబు బాప‌ట్ల టికెట్‌ను ఆయ‌న‌కు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా, వరంగల్‌, విశాఖ రేంజ్‌లలో డిఐజిగా కృష్ణ ప్ర‌సాద్ గ‌తంలో పనిచేశారు. నెల్లూరు, విశాఖపట్నం, మెదక్‌, గుంటూరు ఎస్పీలుగా కూడా పనిచేశారు. ఉమ్మడి గుంటూరులో భాగమైన బాపట్లలో లోక్‌సభ్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో ఎస్పీగా పనిచేసిన అనుభవం పనికొస్తుందనే ఉద్దేశంతో కృష్ణ ప్రసాద్ అభ్యర్ధిత్వానికి టీడీపీ మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో టిక్కెట్ ఇవ్వనందున.. ఏపీలో టీడీపీ తరపున చాన్స్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు అడిగారన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో ఒత్తిడి వస్తే తప్ప చంద్రబాబు ఇలా టిక్కెట్ ఇవ్వరని కూడా అంటున్నారు. ఏదేమైనా ఈ విష‌యంలో టీడీపీ నేత‌లు షాక్‌కు గుర‌వుతున్నారు.

మరోవైపు బాపట్ల నియోజక వర్గంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్‌ పేరునును ఖరారు చేశారు. ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన బాపట్లలో 2014లో టీడీపీ అభ్యర్ధి మాల్యాద్రి శ్రీరామ్ గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్ధి సురేష్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీకి బలమైన క్యాడర్‌ ఉన్న బాపట్లలో 2014లో వైసీపీ అభ్యర్ధి అమృతపాణిని మాల్యాద్రి శ్రీరామ్ 32వేల ఓట్లతో ఓడించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి 16వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.