విశాఖ డ్ర‌గ్స్ కేసు: బీజేపీని బ‌రిలోకి లాగేసిన వైసీపీ

విశాఖ‌ప‌ట్నం స‌ముద్ర తీరంలో వెలుగు చూసిన 25 వేల కిలోల డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. మీరంటే మీరేన‌ని ఒక‌రిపై ఒక‌రు ఈ డ్ర‌గ్స్ వివాదాన్ని రాజ‌కీయంగా మార్చుకుని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే.. ఇంత‌లోనే వైసీపీ మ‌రో వ్యూహాత్మ‌క విమ‌ర్శ‌ల‌ను తెర‌మీదికి తెచ్చింది. ఈ డ్ర‌గ్స్ కేసులో బీజేపీని కూడా లాగేసింది. బీజేపీఏపీచీఫ్ గా ఉన్న ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, ఆమె త‌న‌యుడికి సంబంధించిన కంపెనీలే ఉన్నాయ‌ని పేర్కొంది. దీంతో ఇది మ‌రో కోణం సంత‌రించుకుంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, పార్టీ కీల‌క నేత‌ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డ్ర‌గ్స్‌ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబుకు మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

అంతేకాదు.. పురందేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని సజ్జ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పురందేశ్వరి వియ్యంకుడు కూడా అదే కంపెనీలో భాగస్వామి అని తెలిపారు. వారు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి ఆ తర్వాత విడిపోయారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు అరిచే అరుపులు వింటుంటే, ఈ వ్యవహారం వెనుక ఉన్నది వీళ్లేనేమో అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తమపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడని, దాన్ని పట్టుకువచ్చి ఈ డ్రగ్స్ వ్యవహారానికి అంటగడుడుతున్నారని మండిపడ్డారు. మ‌రి స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం ఢిల్లీలోనే మ‌కాం వేసిన‌(టికెట్ల వ్య‌వ‌హారంపై) ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి, ఆమె భ‌ర్త‌ వెంక‌టేశ్వ‌రావు ఎలా రియ‌క్ట్ అవుతారో చూడాలి.