విశాఖ‌లో డ్ర‌గ్స్‌.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పొలిటిక‌ల్ రచ్చ‌

విశాఖపట్నం స‌ముద్ర‌ తీరంలో వేల కిలోల డ్రగ్స్ ఇత‌ర దేశం నుంచి రావ‌డం… దీనివెనుక అధికార పార్టీ వైసీపీ ఉంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుడంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చిన ఓ సరకు రవాణా కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు ప‌ట్టుకున్నారు. ఈ కంటైనర్ జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న విశాఖ వచ్చినట్టు గుర్తించారు.

ఈ కంటైనర్ భారత్ చేరుకున్న నేపథ్యంలో, ఇంటర్ పోల్ నుంచి ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ సీబీఐ కార్యాలయం విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ నెల 19న నార్కొటిక్స్ అధికారులతో వచ్చి కంటైనర్ ను పరీక్షించిన సీబీఐ… అందులో ఉన్నది నిషేధిత డ్ర‌గ్సేన‌ని నిర్ధారించుకుంది. 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్టు గుర్తించారు. ‘ఆపరేషన్ గరుడ’ పేరిట నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ పట్టుకున్నారు.

కాగా, ఈ డ్రగ్స్ ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ ఎగుమతుల ద్వారా భారత్ కు వచ్చినట్టు సమాచారం. ఇదిలావుంటే, ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారానికి దారితీసింది. త‌నిఖీలు చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు ఏపీ అధికారులు త‌మ విధుల‌కు అడ్డుత‌గిలార‌ని.. సీబీఐ అధికారులు పేర్కొన‌డంతో మొద‌లైన రాజ‌కీయం.. ఇప్పుడు మ‌రింత పెరిగింది. ఈ విష‌యంపై టీడీపీ జోక్యం చేసుకుని.. వైసీపీ హ‌యాంలో ఏపీ డ్ర‌గ్స్ ఆంధ్ర‌గా మారిపోయింద‌ని దుమ్మెత్తిపోయ‌డం గ‌మ‌నార్హం.

చివరిలో వైసిపి డ్రగ్స్ మాఫియా జాక్ పాట్!

“ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంది. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసిపి చీకటి మాఫియాలు జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయి. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన ఓ డబ్బా కంపెనీ (ఆషీ ట్రేడింగ్ కంపెనీ, విజయవాడ) పేరుతో వచ్చిన 21వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకోగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఆందోళన చేస్తూ వస్తోంది. ఈ చీకటి వ్యవహారాలను బయటపెట్టామన్న అక్కసుతోనే గతంలో వైసిపి మూకలు టిడిపి కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి తెగబడ్డాయి. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు… డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్?!” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.