ఆపితే ఆగుత‌రా. పోనిర్రు..

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ను విడిచి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక‌రు ఇద్ద‌రు కాదు.. ఇప్ప‌టికి ప‌దికి పైగా నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పారు. గెలిచిన వారు ఓడిన వారు అనే తేడా లేకుండా.. నాయ‌కులు కారు దిగిపోతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018లోను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు.

అయితే.. బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ చేతిలో ఓడిపోయారు. రామారావు పవార్ 24 వేల మెజార్టీతో విజ యం సాధించారు. ఈ క్ర‌మంలో పార్టీలో విఠ‌ల్‌కు పెద్ద‌గా గుర్తింపు లేక పోవ‌డంతోపాటు.. త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆవేద‌న‌తో విఠ‌ల్ పార్టీకి రాం రాం చెప్పారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీలోనూ ప్ర‌స్తుతానికి ఏమీ ప‌ద‌వులు ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టే ప‌రిస్థితి లేదు అయితే.. ఆర్థికంగా కొంత మేర‌కు సాయం చేసే అవ‌కా శం ఉంద‌ని , ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని విఠ‌ల్ రెడ్డి అనుచ‌రులు చెబుతున్నారు.

ఆపితే ఆగుత‌రా!

కాగా, పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా కాదు.. గుంపులు గుంపులుగా బీఆర్ ఎస్‌ను వీడుతున్న నేప‌థ్యంలో మాజీ మంత్రి బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలిసింది. ఆపితే ఆగుత‌రా. పోనిర్రు. వాళ్లుకు అక్క‌డ తెలిసి వ‌స్తది. రేపు వారిని తీసుకునేదిలేదు. ఇప్పుడు పోయినోళ్లు రేపు రాక‌పోతిరా అని వ్యాఖ్యానించిన‌ట్టు పార్టీ నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.