ఏపీలో ఆరోగ్యశాఖపై జగన్ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ప్రభుత్వం ఆరోగ్య శాఖ, విద్యా శాఖపై ఎక్కువ దృష్టిపెట్టనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య శాఖలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత హామీలో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ .2050 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేయటం కీలక నిర్ణయంగా చెప్పొచ్చు. సంచలనం ఎందుకని అంటున్నామంటే ఇన్ని కాలేజీలకు ఒకేసారి పరిపాలనా అనుమతులు గతంలో ఎప్పుడూ మంజూరు కాలేదు కాబట్టే. వైద్య విద్యతో పాటు ఆసుపత్రులను కూడా నిర్మించాలని అవకాశం ఉన్నచోట్ల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను నిర్మించడానికి పనులు మొదలయ్యాయి.

ఇప్పటికే రాష్ట్రంలో పదకొండు వైద్య కళాశాలలున్నాయి. వీటికి అదనంగా మరో పదకొండు కాలేజీలకు ప్రభుత్వం శనివారం పరిపాలనపరమైన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాధమికంగా రూ. 2050 కోట్లను కూడా మంజూరు చేయటమే ఇక్కడ విశేషం. విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో మెడికల్ కాలేజి ఏర్పాటుకు రూ. 500 కోట్ల మంజూరైంది. అలాగే కడప జిల్లాలోని పులివెందులలో ఏర్పాటు చేయబోయే కాలేజీకి కూడా రూ. 500 కోట్లు మంజూరయ్యింది. కృష్ణజిల్లాలోని మచిలీపట్నంలో ఏర్పాటు చేయబోయే కాలేజీకి రూ. 550 కోట్ల శాంక్షన్ చేసింది ప్రభుత్వం.

ఇదే పద్దతిలో పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ళలోని కాలేజీల్లో తలా 100 చొప్పున మెడికల్ సీట్లను మంజూరు చేసింది. మచిలీపట్నంలోని కాలేజీకి మాత్రం 150 సీట్లు కేటాయించింది. ఇక అమలాపురం, ఏలూరు, పులివెందుల, పిడుగురాళ్ళ, మదనపల్లి, ఆదోనిలో ఏర్పాటు చేయబోయే కళాశాలల స్ధలాల కొనుగోలుకు రూ. 104 కోట్ల కూడా మంజూరయ్యింది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా కనీసం 100 పడకలతో ఆసుపత్రి కూడా ఉండాలనే నిబంధనుంది. దీనిలో భాగంగా ఏర్పాటు చేయబోయే ఆసుపత్రులను ఆధునిక వసతులతో ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి ఆసుపత్రికి అనుబంధంగా రీసెర్చి సెంటర్, ఆధునిక ల్యాబరేటరీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన.

విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఓ మెడికల్ కాలేజీతో పాటు ఆసుపత్రికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇదే పద్దతిలో శ్రీకాకుళంలో ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారంలో భాగంగా ఓ ఆసుపత్రి+డయాలసిస్ కేంద్రంతో పాటు రీసెర్చి కేంద్రం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రజారోగ్యం విషయంలో తీసుకుంటున్న చర్యలు సఫలమైతే అంతకన్నా కావాల్సిదేముంటుంది.