సీనియ‌ర్ల‌ను పక్కన పెడుతున్న బీజేపీ

ఏపీ బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఏపీలో బీజేపీ కురువృద్ధుల‌కు వీర‌తాళ్లు వేయాల‌ని నిర్ణ‌యించింది. వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌ను ముందుపెట్టి విజ‌యం ద‌క్కించుకునేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. టీడీపీ ఎన్డీఏలో చేర‌డంతో ఆరు పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లలో పోటీకి బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో బీజేపీకి దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్లకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి.ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న బీజేపీ నాయ‌కులు పాత‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే అవకాశాలు కల్పిస్తున్నార‌ని, అందుకే పార్టీ ఎద‌గ‌డం లేద‌ని కూడా భావించింది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై సీనియర్లను అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అంతే కాదు ఓడిపోయే సీట్లు కాకుండా.. టీడీపీ నుంచి గెలిచే సీట్ల‌ను మాత్ర‌మే తీసుకోవాల‌ని తాజాగా నిర్ణ‌యానికి వ‌చ్చినట్టు స‌మాచారం. దీంతో ఆ 10 సీట్లు హాట్ కేక్‌లే కావాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ బీజేపీ చీఫ్ పెద్ద‌జాబితాను కేంద్ర బీజేపీ నేత‌ల‌కు స‌మ‌ర్పించారు. దీనిలో సీనియ‌ర్లు చాలా మంది ఉన్నార‌ని తెలిసింది.

వీరికి అవ‌కాశం?

బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌. దయాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత జూపూడి రంగరాజు, జాతీయ మహిళా విభాగం నాయకురాలు మాలతీరాణి ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించ‌నున్న ట్టు బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు సోము వీర్రాజుకు కూడా అవ‌కాశం ద‌క్క‌నుంది. అయితే.. రెండు నుంచి మూడు సీట్ల‌ను జూనియ‌ర్ల‌కు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.

నిజానికి గత ఐదేళ్లుగా బీజేపీలో కీలక పదవుల్లో ఉండి.. ప్రజల్లో పని చేసి.. పార్టీ ఇచ్చిన ప నుల్ని సమర్థంగా నిర్వహించిన యువనేతలు, సీనియర్ నేతలకు ఖచ్చితంగా అవకాశం రావాల్సి ఉంది. కానీ సీనియర్లపై రాజకీయ పరమైన ప్రచారాలు చేసి.. వారికి సీటు రాకుండా చేయడానికి కొంత మంది ప్రయత్నించడం .. వారి మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి ఏర్పడటంతో సీనియర్లు నిరాశపడ్డారు. పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు కానీ.. తమ త్యాగం.. బీజేపీకి నష్టం చేస్తుందని తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ పెద్ద‌లు నిర్ణ‌యించార‌ని స‌మాచారం.