చేసిన పాపం.. కేసీఆర్‌ను వెంటాడుతోందా!

వ్య‌క్తిగ‌త జీవితంలో అయినా.. రాజ‌కీయంగా అయినా.. చేసిన పాపం వెంటాడుతుంద‌నే వాద‌న వినిపిస్తుంది. ఇప్పుడు తెలంగా ణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విష‌యంలోనూ ఇదే మాట నెటిజ‌న్ల నుంచి వినిపిస్తోంది. ఏకంగా బీఆర్ ఎస్ లెజిస్లేచ‌ర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు లోపాయికారీగా చేస్తున్న వ్యాఖ్య‌లు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు నెటిజ‌న్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఇటీవ‌ల వ‌రుస పెట్టి నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.

సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీ మారడం పార్టీ పెద్దలను ఆందోళనకి గురి చేస్తోంది. ఆయనపై యాక్షన్ తీసుకోవాలంటూ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. మరోవైపు దానం బాటలోనే ఇంకెంతమంది ఎమ్మేల్యేలు పార్టీని వీడతారో అనే భయం బీఆర్ ఎస్‌లో మొదలైంది. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచన కారణంగా ముందుగా పార్టీలో చేర్చుకున్నారని తెలుస్తోంది.

ఇక‌, మ‌రోవైపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే ఉద్దేశంతో చాలా మందితో సంప్రదింపులు జరిపినట్లుగా ప్రచారం జరుగు తోంది. ఎమ్మెల్యేలకు ఉన్న వివిధ రకాల వ్యాపార సమస్యలు, ఇతర అంశాల ఆధారంగా కాంగ్రెస్ నుంచి వస్తున్న ఒత్తిడితో ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల కదలికలపై బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. అయినా కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, పార్టీ మారుతార‌ని భావిస్తున్న ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల‌ను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

గ‌తంలో ఏం జ‌రిగింది?

2014, 2018 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో బీఆర్ఎస్ కు అరకొర మెజార్టీ లభించింది. ఆ సమయంలో ఓటుకు నోటు కేసు బయటపడటంతో .. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించి.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆ సమయంలో ప్రజల మద్దతు లభించింది. దీనికి సాక్ష్యంగా 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల ద్వారా తేలిపోయింది. పార్టీ ఫిరాయించిన వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ గెలిచారు.

కానీ, రెండో సారి 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని విలీనం చేసుకున్నారు. ఆ సమయంలో ప్రజల మద్దతు లభించలేదు. ఈ ఫిరాయింపుదారులంతా ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే.. అప్ప‌ట్లో కాంగ్రెస్ నుంచితీసుకున్న వారిలో కొంద‌రికి ఏకంగా మంత్రి ప‌ద‌వులు కూడా కేసీఆర్ క‌ట్ట‌బెట్టారు. ఈ పాప‌మే ఇప్పుడు కేసీఆర్‌ను వెంటాడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై ఆన్‌లైన్ వేదిక‌గా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లోనూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.