టీడీపీకా.. బీజేపీకా.. హిందూపురం టికెట్‌పై స‌స్పెన్స్‌!

పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్ప‌టికే 6 పార్ల‌మెంటు స్థానాల‌ను బీజేపీకి కేటాయించిన విష యం తెలిసిందే. అయితే.. వీటిలో ఏవేవి ఇస్తార‌నే చ‌ర్చ‌జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట అయిన‌.. హిందూపురం పార్ల‌మెంటు స్థానం విష‌యంపై మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ టికెట్‌ను తొలుత బీజేపీకి కేటాయించారు. అయితే..ఇ ప్పుడు స‌మీక‌ర‌ణ‌లు మారాయ‌ని తెలుస్తోంది. మైనారిటీ వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ బీజేపీ పోటీ చేసినా ఫ‌లితం ఉండ‌ద‌నే కామెంట్లు, అంచ‌నాలు వ‌చ్చాయి. దీంతో బీజేపీ యూట‌ర్న్ తీసుకుని ఇది కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి పొత్తుకుదిరిన తొలినాళ్ల‌లో హిందూపురం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ తరఫున కాకినాడ శ్రీపీఠం పీఠాధిప‌తి పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ముస్లిం మైనారిటీ ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను కాద‌ని మ‌ళ్లీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో రాజ‌కీయంగా హిందూపురంపై చ‌ర్చ కూడా సాగింది. అయితే.. మారిన తాజా ప‌రిణామాలు(ఏపీబీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి ఢిల్లీకి వెళ్లాక‌) టీడీపీనే పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధికి హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని తాజాగా టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

హిందూపురం నుంచి బీకే పార్థసారధిని కాకుండా అనంతపురం నుంచే అభ్యర్థిగా నిలబడతారని మ‌రో చ‌ర్చ సాగుతోంది. అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేపీ పవన్ రెడ్డి పేరు మ‌రోవైపు ప్రచారంలోకి వచ్చింది. అవకాశం కల్పిస్తే పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేక హిందూపురం ఎంపీ టికెట్టు కేటాయించాలని చంద్రబాబును పార్థసారధి కోరారు. ఇదే సందర్భంలో హిందూపురం లోక్ సభ సీటుపై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, హిందూపురం లోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ కూడా పోటీ పడుతున్నారు. దీంతో టిడిపి అధిష్టానం హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక కోసం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని మ‌రో చ‌ర్చ సాగుతోంది.

ఇదివరకు చంద్ర‌బాబు నిర్వహించిన ఐవీఆర్ ఎస్ సర్వే సందర్భంగా వచ్చిన పేరుని ఖరారు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కదిరి, పెనుగొండ, పుట్టపర్తి, సింగనమల, మడకశిర నియోజకవర్గాల అభ్యర్థులను సర్వే ద్వారానే ఎంపిక చేశారు. ప్రస్తుతం హిందూపురం అభ్యర్థిగా ఐ వి ఆర్ ఎస్ సర్వేలో భాగంగా దళ‌వాయి వెంకట‌ రమణ పేరు బలపరిస్తే ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి అంటూ సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా బట్టి చూస్తే ఆయ‌న‌కు ఈ టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం హిందూపురం కేటాయింపుపై స‌స్పెన్స్ అయితే కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.