వైసీపీలో చేరిన వంగ‌వీటి రాధా త‌మ్ముడు.. రీజ‌నేంటి?

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా సోద‌రుడు(చిన్నాన్న కుమారుడు) వంగ‌వీటి న‌రేంద్ర తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్త‌వానికి కాపు సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేసేలా.. సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌రుస పెట్టి కాపు నేత‌ల‌ను, ఆ వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌న్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు.

కొన్నిరోజుల కింద‌ట‌.. చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య కుమారుడు సూర్య‌ప్ర‌కాష్‌ను పార్టీలో చేర్చుకున్నారు. త‌ర్వాత‌.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఏకంగా వంగ‌వీటి రాధా త‌మ్ముడిని పార్టీలోకి తీసుకున్నారు. వాస్త‌వానికి రాధా గ‌త 2019 ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు వైసీపీలోనే ఉన్నారు.అ యితే, ఆయ‌న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో టీడీపీలోకి వెళ్లారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ‌సాగుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో రాధా సోదరుడిని పార్టీలోకి తీసుకోవ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, తాను బీజేపీ నుంచి బయటికి వచ్చేశానని వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డితో చర్చించిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని నరేంద్ర పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలది నాలుగు దశాబ్దాల అనుబంధం అని చెప్పారు. వంగవీటి రంగాను అభిమానిస్తానని చెప్పుకునే పవన్ కల్యాణ్ టీడీపీతో ఎలా కలుస్తాడని నరేంద్ర ప్రశ్నించారు.

టీడీపీతో పొత్తు కుదుర్చుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తన సోదరుడు వంగవీటి రాధా గతంలో వైసీపీ నుంచి బయటికి వచ్చేసి తప్పు చేశాడని నరేంద్ర అన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని, ఈ ఐదేళ్లలో జగన్ అందించిన సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. కాగా, ఈయ‌న‌ను పిఠాపురం, కాకినాడ జిల్లాల్లో వైసీపీ ప్ర‌చారానికి వినియోగించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. కాపు నాయ‌కుల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఈయ‌న‌ను వాడేయ‌నుంద‌నే చ‌ర్చ సాగుతోంది.