ఏపీలో అరాచక పాలన.. అందుకే బాబుకు మ‌ద్ద‌తు: జేపీ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీజేపీలు క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కూట‌మికి, ముఖ్యంగా చంద్ర‌బాబుకు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నామ‌ని లోక్‌స‌త్తా వ్య‌వ‌స్థాప‌కుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ(జేపీ) చెప్పారు. ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో మేం ఎన్డీయే కూటమివైపే ఉంటాం. ఏపీలో అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు ఏకమవ్వాలి అని జేపీ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని జేపీ అభిప్రాయ‌ప‌డ్డారు. రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే.. కమ్మ, కాపులు ప్రతిపక్ష పార్టీల వైపు ఉన్నారని తెలిపారు. `సంక్షేమమే పాలన అనుకుని, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది. అభివృద్ధి చేస్తేనే పాలన. అప్పులు చేస్తే కాదు. ఏపీ కంటే ఒడిశాలో ప‌రిస్థితి బాగుంది. ఒడిశాలో రూ.26 వేల కోట్ల ఆదాయం ఉంది. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా అవసరం అనుకుంటేనే అప్పులు చేస్తారు. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి లేదు అని జేపీ నిప్పులు చెరిగారు.

ఏపీలో నియంత‌లు

ఏపీలో రాజకీయ పరిస్థితులు ఇంతలా దిగజారడం బాధాకరమని జేపీ వ్యాఖ్యానించారు. ఏపీలో అధికారంలో ఉన్న వ్యక్తులు నియంతలను తలపిస్తున్నారు. మద్దతు ప‌లికితే పూల బాట ప‌రుస్తున్నారు. విమ‌ర్శించేవారికి ముళ్లబాటలు పరుస్తున్నారు. ఓవైపు దోపిడీ చేస్తూ, మరో వైపు సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? అని జేపీ నిల‌దీశారు. కొందరు క్లాస్ వార్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి భాష ప్రమాదకరం. సంస్కరణల అమలు సాధ్యం కాదు అనే వారు అసమర్థుల కిందే లెక్క అని జేపీ వ్యాఖ్యానించారు.

లోకేష్ హ్యాపీ..

లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం ప‌ట్ల టీడీపీ యువ‌నాయకుడు నారా లోకేష్ సంతోషం వ్య‌క్తం చేశారు. అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగిన జయప్రకాశ్ నారాయణ వంటి మేధావి ఏపీ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలకడం హర్షణీయం. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ వంతు పాత్రను పోషించేందుకు ముందుకు రావడం పట్ల మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్ అంటూ లోకేష్ పేర్కొన్నారు.