వైఎస్ షర్మిల ‘బ్లైండ్’ గేమ్.! మాస్టర్ మైండ్ ఎవరిది?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయం కాంగ్రెస్ నేతలకే అర్థం కావడంలేదు. అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల, అనూహ్యంగా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడేమో, ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు వైఎస్ షర్మిల, అదీ ఎన్నికల సమయంలో. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పులివెందుల అసెంబ్లీకి ట్రై చేయొచ్చు కదా.? అంటే, ఆ సీటుని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డికి రిజర్వ్ చేసి పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వివేకా సతీమణి పేరు కూడా పరిశీలనలో వుందిట.

కాగా, కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ తాజాగా, కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన తిరిగి వైసీపీలోకే వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో షర్మిలని చూసి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా, తిరిగి సొంత గూటికే చేరతారన్న ప్రచారం బలపడింది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ముందు ముందు ఏం చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

మరోపక్క, షర్మిల విషయమై కాంగ్రెస్ నేతలు కొంత కలత చెందుతున్నారట. చివరి నిమిషంలో షర్మిల హ్యాండ్ ఇస్తే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటన్నది వారందరి ఆవేదనగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ విషయమై షర్మిల మాస్టర్ ప్లాన్ ఏంటి.? ఆమె ఏమైనా మైండ్ గేమ్ ఆడుతోందా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికైతే సమాధానం దొరకని పరిస్థితి.

కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించేయడానికే షర్మిల, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్న అనుమానాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయ్. ఇంతకీ, షర్మిల వ్యూహమేంటి.? అసలామె ఎవరి తరఫున ఎవరి కోసం రాజకీయం చేస్తున్నట్టు.?