చ‌క్రం తిప్పిన టీడీపీ టాప్ లీడ‌ర్‌.. అల్లుడికి ఎంపీ టిక్కెట్ ఫిక్స్‌..!

ఏపీలో ఎన్నిక‌ల డేట్లు వ‌చ్చేశాయి. కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేయ‌డంతో ఎవ‌రికి వారు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. వైసీపీ క్యాండెట్లు మొత్తం ఫిక్స్ అయ్యారు. ఇక టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిలో ఉండ‌డంతో ఈ కూట‌మి పార్టీల త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థులు ఇంకా కొన్ని చోట్ల ఫిక్స్ కావాలి. టీడీపీ ఎంపీ క్యాండెట్ల పేర్ల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా ఉంటే టీడీపీలో ఓ టాప్ లీడ‌ర్ త‌న అల్లుడికి ఎంపీ సీటు కోసం చ‌క్రం తిప్పి దాదాపు స‌క్సెస్ అయ్యార‌న్న ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లో గ‌ట్టిగా న‌డుస్తోంది. ఈ సీనియ‌ర్ నేత ఎవ‌రో కాదు.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. య‌న‌మ‌ల ఫ్యామిలీకి ఇప్ప‌టికే రెండు టిక్కెట్లు ద‌క్కాయి.

య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌కు తుని అసెంబ్లీ సీటు కేటాయించారు. ఇక య‌న‌మ‌ల వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు మైదుకూరు సీటు కేటాయించారు. ఇక ఇప్పుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కుమారుడు పుట్టా మ‌హేష్ యాద‌వ్‌కు ఏలూరు పార్ల‌మెంటు సీటు కోసం య‌న‌మ‌ల లాబీయింగ్ స్టార్ట్ అవ్వ‌డంతో పాటు దాదాపు స‌క్సెస్ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలిసింది. యేడాది క్రిత‌మే మ‌హేష్ యాద‌వ్ న‌ర‌సారావుపేట పార్ల‌మెంటు సీటుపై క‌న్నేసి ఆ పార్ల‌మెంటు ప‌రిధిలో టీడీపీ నేత‌లంద‌రిని క‌లుస్తూ వ‌ర్క్ చేసుకుంటూ వ‌చ్చారు.

అయితే అక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు తేడా వ‌చ్చాయి. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ పార్టీ మార‌తార‌న్న ఊహాగానాలు స్టార్ట్ అవ్వ‌డం.. ఆ సీటు లావుకే టీడీపీ ఇస్తుంద‌న్నది దాదాపు ఖ‌రారు చేసుకున్నాకే మ‌హేష్ సైలెంట్ అయిపోయారు. క‌ట్ చేస్తే ఇప్పుడు వైసీపీ ఏలూరు పార్ల‌మెంటు సీటును యాద‌వ కమ్యూనిటీకే చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు కారుమూరి సునీల్‌కుమార్ కు ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ కూడా అదే బీసీ – యాద‌వ క‌మ్యూనిటీ వ్య‌క్తినే దింపే ఆలోచ‌న‌లో ఉంది.

ఈ క్ర‌మంలోనే చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గోరుముచ్చు గోపాల్ యాద‌వ్ పేరు ముందుగా వినిపించింది. అయితే ఇప్పుడు య‌న‌మ‌ల స్వ‌యంగా రంగంలోకి దిగి రిక‌మెండేష‌న్ చేయ‌డంతో చంద్ర‌బాబు వారం రోజుల క్రిత‌మే మ‌హేష్ యాద‌వ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏలూరు పార్ల‌మెంటు టీడీపీ అభ్య‌ర్థి మ‌హేష్ యాద‌వ్ అయితే ఎలా ఉంటుంద‌ని ఐవీఆర్ఎస్ స‌ర్వేలు జ‌రుగుతున్నాయి.

అటు బ‌ల‌మైన కుటుంబ నేప‌థ్యం, ఇటీ బీసీల్లో యాద‌వ సామాజిక వ‌ర్గం కావ‌డం.. వైసీపీ ఈక్వేష‌న్‌కు ఈక్వ‌ల్‌గా బ్యాలెన్స్ అయ్యేలా ఉండ‌డం.. ఆర్థిక‌, అంగ‌బ‌లాల్లో తిరుగులేక‌పోవ‌డం ఇవ‌న్నీ మ‌హేష్ యాద‌వ్‌కు ఫ్ల‌స్ కానున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా మ‌హేష్ యాద‌వ్‌కు ఎంపీ టిక్కెట్ ల‌క్ చిక్కుతుందో ? లేదో ? చూడాలి.