ద‌ళిత బంధు దెబ్బేసింది.. బేఫిక‌ర్‌: కేసీఆర్‌

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓడిపోతుంద‌ని తాను భావించ‌లేద‌ని ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ద‌ళిత బంధు ద్వారాఇచ్చిన రూ.10 ల‌క్ష‌లు పార్టీని గెలిపిస్తాయ‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. అయితే.. అదే త‌మ పార్టీని ఓడించింద‌ని చాలా మంది త‌న‌కు చెప్పిన‌ట్టు వ్యాఖ్యానించారు. “ఓడితే ఓడినం.. కానీ, మ‌నం అమ‌లు చేసిన ద‌ళిత బంధు అనేక కుటుంబాల్లో వెలుగులు నింపింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూడా దీనిని ప్ర‌చారం చేసుకుని.. కాంగ్రెస్ ను దెబ్బ‌తీయాలి” అని పార్టీ నాయ‌కుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడానన్నారు. వందలాది సంఘటనలను ఉద్యమంలో చూశానని కేసీఆర్ చెప్పారు. ఉద్యమం అంటే నినాదాలు చేస్తూ చేతిలో రాళ్లు పట్టుకోవడం కాదని.. ఉద్యమానికి ఒక పద్ధతి , సిద్దాంతం ఉంటుందని, ఆ ప్ర‌కార‌మే తాను ముందుకు సాగాన‌ని వివ‌రించారు. వ్యవసాయం స్థిరీకరణ జరగాలని రైతు బంధు తీసుకువచ్చినట్లు చెప్పారు. దళితబంధు తెచ్చినా దళిత సమాజం ఎందుకు ఈ పథకాన్ని అభినందించలేదని వాపోయారు.

తాజాగా పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్న‌ట్టు కేసీఆర్ చెప్పారు. “ప్రవీణ్ కుమార్ నేడు బీఆర్ఎస్ లో చేరిన సందర్భం బాగుంది. భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్‌కు మరిన్ని ఉన్నత పదవులలో అవకాశాలు కల్పిస్తా. పార్టీని నిర్మాణం చేసుకుందాం. కమిటీలు వేసుకుందాం. ఇక్కడే నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం. రానున్న రోజుల్లో మనం అద్భుతమైన విజయం సాధించడం ఖాయం” అని పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి, కేంద్రంలో ఒక పదవి ఇస్తామని తనకు కొందరు ఆఫర్ చేశారని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో దళిత బంధు ఇస్తే అంబేడ్కర్ మనవడు ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పేట్టి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి అంబేద్కర్ ఇల్లు అని అభినందించారన్నారు. అయినా.. ఎందుకు ఓడిపోయామ‌నే అంద‌రూ ఆలోచించుకోవాల‌న్నారు.